ధాన్యం కొనుగోళ్లకు పూర్తిస్థాయిలో సన్నద్దం కండి- కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశం

ABN , First Publish Date - 2020-09-24T21:12:48+05:30 IST

వానాకాలంలో ధాన్యం కొనుగోళ్లకు పూర్థిస్థాయిలో సన్నద్ధం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లకు పూర్తిస్థాయిలో సన్నద్దం కండి- కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశం

హైదరాబాద్‌: వానాకాలంలో ధాన్యం కొనుగోళ్లకు పూర్థిస్థాయిలో సన్నద్ధం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కనీస మద్దతు ధరకు ధాన్యం అమ్ముకునేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. 2020-21 వానాకాలం సీజన్‌ ఏరాట్పలపై గురువారం అన్నిజిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి క్లస్టం మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) ఈనెల 30వ తేదీలోగా, యాసంగి సీజన్‌కు సంబంధించి సీఎంఆర్‌ను అక్టోబరు 20వ తేదీలోగా పూర్తిచేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. సీఎంఆర్‌లో జాప్యం జరగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పై అదనంగా ఆర్ధిక భారం పడుతోందని, దీన్ని దృష్టిటో పెట్టుకుని తక్షణం రైస్‌ మిల్లర్ల నుంచి సీఎంఆర్‌ను సేకరించాలని అధికారులను ఆదేశించారు. 


టెలికాన్ఫరెన్స్‌ అనంతరం ఎఫ్‌సీఐ, పౌరసరఫరాలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎంఆర్‌ అప్పగించడానికి ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. గోదాముల్లో స్టోరేజ్‌ సమస్య లేకుండా సీఎంఆర్‌ క్లెయిమ్స్‌ చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని ఎఫ్‌సీఐ జనరల్‌ మేనేజర్‌ను ఆదేశించారు. సమావేశంలో పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, ఎఫ్‌సీఐ జనరల్‌ మేనేజర్‌ అశ్వినీకుమార్‌, ఎఫ్‌సీఐ, పౌరసరఫరాలశాఖ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-24T21:12:48+05:30 IST