పదో తరగతి కూడా చదవలేదు.. కానీ డాక్టర్లనే బోల్తా కొట్టించి.. రూ.40 లక్షల మోసం

ABN , First Publish Date - 2020-03-22T17:40:19+05:30 IST

వారంతా ఉన్నత చదువులు చదివారు.. డాక్టర్‌గా పెద్ద కొలువులు చేస్తున్నారు. టెక్నాలజీపై పట్టుంది.. అయితేనేం పదోతరగతి కూడా చదవని సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కి గిలగిలకొట్టుకుంటున్నారు.

పదో తరగతి కూడా చదవలేదు.. కానీ డాక్టర్లనే బోల్తా కొట్టించి.. రూ.40 లక్షల మోసం

ఒక్క నెలలో ముగ్గురిని బురిడీకొట్టించిన సైబర్‌ నేరగాళ్లు

రూ. 40.35లక్షలు కొల్లగొట్టిన కేటుగాళ్లు


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): వారంతా ఉన్నత చదువులు చదివారు.. డాక్టర్‌గా పెద్ద కొలువులు చేస్తున్నారు. టెక్నాలజీపై పట్టుంది.. అయితేనేం  పదోతరగతి కూడా చదవని సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కి గిలగిలకొట్టుకుంటున్నారు. నెలరోజుల వ్యవధిలో ముగ్గురు డాక్టర్లను సైబర్‌ నేరగాళ్లు దగా చేశారు. వారి నుంచి మొత్తం రూ. 40.35లక్షలు కొల్లగొట్టారు.


ట్రేడింగ్‌ పేరుతో రూ. 23.90లక్షలు టోపీ..

మియాపూర్‌ మదీనగూడ ప్రాంతానికి చెందిన ఓ డాక్టర్‌ను ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో ముంబైకి చెందిన దంపతులు రూ.23.90లక్షలు కుచ్చుటోపీ పెట్టారు. రామకృష్ణ గౌస్‌కొండ, మిట్టు గౌసుకొండ అనే దంపతులు వాట్సాప్‌లో డాక్టర్‌ను పరిచయం చేసుకున్నారు. కొద్దిరోజుల తరువాత తాము ఫోరెక్స్‌ ట్రేడింగ్‌లో వ్యాపారం చేస్తున్నామన్నారు. కస్టమర్‌లకు మంచి టిప్స్‌ ఇచ్చి ఎక్కువ లాభాలు వచ్చే విధంగా చేస్తున్నామని నమ్మించారు. మీరు కూడా ఫోరెక్స్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే కోట్ల రూపాయలు సంపాదించ్చని నమ్మబలికారు. రూ.1లక్ష పెట్టుబడి పెడితే 9 నెలల్లో పెట్టుబడితో కలిపి మూడు లక్షలు చెల్లిస్తారు అంటూ.. తమ సైబర్‌ తెలివితేటలు ప్రదర్శించారు. ఆ దంపతులు చెప్పిన మాటలు పూర్తిగా నమ్మిన డాక్టర్‌.. వాళ్లు చెప్పిన విధంగా 5నెలల్లో మొత్తం రూ.23.90లక్షలు ఆన్‌లైన్‌లో ఫోరెక్స్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడిగా పెట్టారు. ఆ డబ్బులు చేతికందిన తర్వాత ఆ సైబర్‌ దంపతులు ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేశారు. పోలీసులను ఆశ్రయించిన డాక్టర్‌ తనగోడు వెల్లబోసుకున్నాడు.


మహిళా డాక్టర్‌ నుంచి రూ.12.45లక్షలు..

డాక్టర్‌ను అని రెండో పెళ్లి చేసుకుంటానని ఒక మహిళా డాక్టర్‌ను నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు ఆమె నుంచి రూ. 12.45లక్షలు కొల్లగొట్టారు. మ్యాట్రిమోని సైట్లో విడోమ్యాట్రిమోని విభాగంలో నైజీరియన్‌ సైబర్‌ నేరగాడు తాను కెనడాలో ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ను అంటూ రెండో పెళ్లికోసం చూస్తున్న మహిళకు జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు నకిలీ ప్రొఫైల్‌ అప్‌లోడ్‌ చేశాడు. అతని ప్రొఫైల్‌ నచ్చిన మహిళలు అతనితో రెండో పెళ్లికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ముందస్తు ప్రణాళికలో భాగంగా ఆ సైబర్‌ కేటుగాడు మ హిళతో పరిచయం పెంచుకుంటాడు. ప్రతిరోజూ వాట్సా్‌పలో చాటింగ్‌ చేసేవాడు. త్వరలోనే ఇండియాకు వచ్చి అక్కడే ఆస్పత్రి పెడతానని నమ్మించాడు.  నీమీద ఉన్న ప్రేమకు గుర్తుగా డాలర్లు, బంగారంతో కూడిన ఖరీదైన కానుక పంపిస్తున్నానని నమ్మించాడు. ఎయిర్‌పోర్టులో గిఫ్టు బాక్స్‌ ఆగిపోయిందని, కస్టమ్స్‌ చార్జీ లు, జీఎస్టీ, ఇతర ఖర్చుల పేరుతో రూ.12.45లక్షలు కొల్లగొట్టాడు. చివరకు మోసపోయానని గ్రహించిన డాక్టర్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నైజీరియన్‌ ముఠాను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. 


కేవైసీ అప్‌డేట్‌ అంటూ..

పేటీఎంలో కేవైసీ అప్‌డేట్‌ చేయాలంటూ నమ్మించి ఓ డాక్టర్‌ను బురిడీ కొట్టించిన సైబర్‌ కేటుగాళ్లు రూ.4లక్షలు కొట్టేశారు. సైబరాబాద్‌ ప్రాంతానికి చెందిన ఒక డాక్టర్‌ ఫోన్‌కు ఒక ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. మీరు ఉపయోగిస్తున్న పేటీఎం వివరాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం.. వెంటనే కేవైసీ వివరాలు, ఖాతా వివరాలు అప్‌డేట్‌ చేయాలని ఉంది. దాంతో పాటు వచ్చిన గూగుల్‌ లింక్‌ను ఓపెన్‌ చేశాడు. వెంటనే అందులో ఉన్న అన్ని వివరాలు పూర్తి చేశాడు. ఈ క్రమంలో అతని బ్యాంకు వివరాలన్నీ సైబర్‌ నేరగాళ్లకు చేరిపోయాయి. అంతే..! నిమిషాల్లో ఖాతాలో డబ్బులు ఖాళీ అయ్యాయి. మొత్తం రూ.4.00 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయానని గుర్తించిన డాక్టర్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఇటీవల నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.


నెల రోజుల వ్యవధిలోనే..

ఇటీవల నెల రోజుల వ్యవధిలోనే ముగ్గురు డాక్టర్‌లు సైబర్‌ నేరగాళ్ల బారినపడి రూ.40.35లక్షలు పోగొట్టుకున్నట్లు సైబర్‌ క్రైం పోలీసులు తెలిపారు. ఉన్నత విద్యావంతులు, ఉన్నతోద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు సైతం ముక్కు ముఖం తెలియని సైబర్‌ నేరగాళ్ల బారినపడి రూ.లక్షల్లో పోగొట్టుకోవడం ఆందోళన కలిగిస్తోందని సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పొలీసులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2020-03-22T17:40:19+05:30 IST