ఢిల్లీ కేపిటల్స్ ఫిజియోకు కరోనా
ABN , First Publish Date - 2022-04-15T23:24:18+05:30 IST
ఢిల్లీ కేపిటల్స్ ఫిజియో పాట్రిక్ ఫర్హాత్ కరోనా బారినపడ్డారు. ఈ మేరకు ఐపీఎల్ తెలిపింది..
ముంబై: ఢిల్లీ కేపిటల్స్ ఫిజియో పాట్రిక్ ఫర్హాత్ కరోనా బారినపడ్డారు. ఈ మేరకు ఐపీఎల్ తెలిపింది. వైద్యులు ఆయనను పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొంది. కరోనా తొలి దశ కారణంగా రెండేళ్ల క్రితం ఐపీఎల్ వాయిదా పడింది. ఆ తర్వాత యూఏఈలో టోర్నీని కొనసాగించారు. గతేడాది ఐపీఎల్ భారత్లోనే ప్రారంభమైనప్పటికీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా బయోబబుల్లో ఉన్న పలువురు ఆటగాళ్లు కొవిడ్ బారినపడ్డారు. దీంతో టోర్నీ మధ్యలోనే నిలిచిపోయింది. కరోనా కాస్తంత నెమ్మదించాక యూఏఈలో రెండో అంచె నిర్వహించి టోర్నీని పూర్తి చేశారు.
కరోనా దాదాపు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ సీజన్ను పరిమిత స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు. అలాగే, 25 శాతం మంది ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతిస్తున్నారు. ఢిల్లీ కేపిటల్స్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడి రెండింటిలో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఆ జట్టు శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది.