బాహుబలి కలెక్షన్లపై దర్యాప్తు..? ప్రభుత్వ ఖజానాకు ఎంత పన్ను రాలేదో లెక్క తేల్చాల్సి ఉందంటూ సజ్జల కామెంట్స్

ABN , First Publish Date - 2021-09-29T09:48:55+05:30 IST

ఎన్టీఆర్‌ నుంచి రాజబాబు వరకు ఎవరి సినిమాలైనా గతంలో టికెట్‌ ధరలు ఒకేలా ఉండేవని.. సినిమా బాగుంటే ఎక్కువ రోజులు ఆడేవని వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

బాహుబలి కలెక్షన్లపై దర్యాప్తు..? ప్రభుత్వ ఖజానాకు ఎంత పన్ను రాలేదో లెక్క తేల్చాల్సి ఉందంటూ సజ్జల కామెంట్స్

బాహుబలి కలెక్షన్‌లో పన్ను ఎగవేత! 

ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యలు 


అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి):  ఎన్టీఆర్‌ నుంచి రాజబాబు వరకు ఎవరి సినిమాలైనా గతంలో టికెట్‌ ధరలు ఒకేలా ఉండేవని.. సినిమా బాగుంటే ఎక్కువ రోజులు ఆడేవని వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కానీ.. ఇప్పుడు.. టిక్కెట్‌ ధరను రూ.500 వరకు పెంచేసి వారం రోజుల్లోనే పెట్టుబడులు రాబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. తెలుగు సీనీ పరిశ్రమకు పవన్‌ కల్యాణ్‌ పెద్ద గుదిబండగా మారారని సజ్జల విమర్శించారు. బాహుబలి సినిమా విషయంలో సగం డబ్బు ప్రభుత్వానికీ.. డిస్ట్రిబ్యూటర్లకూ వెళ్లలేదని సజ్జల తెలిపారు. ఆన్‌లైన్‌ విధానంలో అక్కడికక్కడే ఎవరికెళ్లాల్సిన డబ్బులు వారికి వెంటనే వెళ్లిపోతాయన్నారు. ప్రభుత్వ తీసుకువచ్చిన విధానం వల్ల ఎన్టీఆర్‌ సినిమా అయినా.. కాంతారావు సినిమా అయినా టికెట్‌ ధర ఒకేలా ఉంటుందని అన్నారు. ప్రేక్షకుడికి సరసమైన ధరకు వినోదం లభిస్తుందంటే పవన్‌ ఎందుకు వద్దంటున్నారో చెప్పాలన్నారు. సినిమా టికెట్ల వల్ల బహుశా రూ.200 కోట్లు వస్తాయేమోనని.. దాంతో ప్రభుత్వం ఎంత అప్పు తీసుకుంటుందని, ఈ విషయాన్ని కూడా పవన్‌ చెబితే.. బాగుంటుందని సజ్జల వ్యాఖ్యానించారు. 


బాహుబలి కలెక్షన్లపై దర్యాపు!

ప్రభాస్‌ హీరోగా నటించిన బాహుబలి సినిమా టికెట్ల కలెక్షన్‌ విషయంలో సినిమా విడుదలైన తొలివారంలో సగం డబ్బు ప్రభుత్వానికి.. డిస్ట్రిబ్యూటర్లకూ వెళ్లలేదని తెలిసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సినిమా విడుదలైన తొలి వారంలో థియేటర్లలో సగం సీట్లు ఖాళీగా ఉన్నట్లు చూపినట్టు తెలిసిందన్నారు. ఈ లెక్కన ఎంత మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు పన్ను రాలేదో తేల్చాల్సి ఉందన్నారు. ఈ వ్యవహారంపై నిజం నిగ్గుతేలేలా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. 

Updated Date - 2021-09-29T09:48:55+05:30 IST