నేటి నుంచి టీచర్లందరూ బడులకు రావాలి
ABN , First Publish Date - 2021-03-03T12:17:17+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల రోజువిడిచి రోజు విధులను ప్రభుత్వం రద్దుచేసింది. బుధవారం నుంచి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులంతా పాఠశాలలకు
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల రోజువిడిచి రోజు విధులను ప్రభుత్వం రద్దుచేసింది. బుధవారం నుంచి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులంతా పాఠశాలలకు హాజరవ్వాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు రోజువిడిచి రోజు చొప్పున హాజరవుతున్నారు. ఉన్నత పాఠశాలలకు (9, 10 తరగతులు) ఫిబ్రవరి 1 నుంచి, ప్రాథమికోన్నత పాఠశాలలకు (6, 7, 8 తరగతులు) గత నెల 24 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో ప్రాథమిక తరగతుల ఉపాధ్యాయుల మినహా అందరూ ప్రతిరోజు విధులకు హాజరవుతున్నారు. బుధవారం నుంచి ప్రాథమిక ఉపాధ్యాయులు కూడా హాజరవుతుండడంతో ప్రత్యక్ష తరగతులు సాగుతున్న పాఠశాలల్లో అవసరాలను బట్టి ఆ టీచర్లను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోనూ వినియోగించుకోవాలని శ్రీదేవసేన మంగళవారం జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు.