ప్రకాశం జిల్లా: వ్యాక్సిన్ వికటించి అస్వస్థతకు గురైన డాక్టర్
ABN , First Publish Date - 2021-01-27T19:25:39+05:30 IST
కరోనా వ్యాక్సిన్ వికటించి యువ డాక్టర్ ధనలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ వికటించి యువ డాక్టర్ ధనలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒంగోలు జీజీహెచ్తోపాటు సంఘమిత్ర ఆస్పత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్ ధనలక్ష్మిని చెన్నై తరలించారు. ఒంగోలు జీజీహెచ్లో డాక్టర్గా పనిచేస్తున్న ఆమె ఈ నెల 23న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే 24 నుంచి డాక్టర్ జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో జీజీహెచ్లో ఆమెకు చికిత్స అందించారు. కానీ జ్వరం ఎక్కువ కావడంతోపాటు ఒక్కసారిగా బీపీ తగ్గిపోయింది. వెంటనే అప్రమత్తమైన జీజీహెచ్ వైద్యులు చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రి సంఘమిత్రకు తరలించారు. అయితే అక్కడ కూడా ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్ ధనలక్ష్మిని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు.