విచారణలో నిష్పాక్షికత లేదు
ABN , First Publish Date - 2020-08-15T09:52:38+05:30 IST
విచారణలో నిష్పాక్షికత లేదు
విజయవాడ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని రమేశ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేశ్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. ‘అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఘటనాస్థలిలో లేకున్నా డాక్టర్ రాజగోపాల్, డాక్టర్ సుదర్శన్ను పోలీసులు నిర్బంధించడం సరికాదు. అది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. ఘటన జరిగిన ఆదివారం నాడు నేను, ఆ డాక్టర్లు ఇద్దరూ కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ సమక్షంలో విచారణలో పాల్గొన్నాం. మా ఆస్పత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు అవాస్తవం. నిష్పక్షపాత న్యాయవిచారణకు ఆస్పత్రి యాజమాన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పది లక్షల మందికిపైగా మా ఆస్పత్రిలో హృద్రోగ చికిత్సలు చేయించుకున్నారు. 5వేల మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారు. నా పేరు డాక్టర్ రమేశ్బాబు. కొంతమంది ప్రజాప్రతినిధులు అందులో బాబుని తీసేసి చౌదరి అని తగిలించడం నాకెంతో బాధ కలిగించింది. వైద్యానికి కుల, మత, రాజకీయాలను ఆపాదించడం సమంజసం కాదు. స్వర్ణ ప్యాలె్సలో కొవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించాక.. చాలా మంది క్రిటికల్ స్టేజ్లో ఉన్న బాధితులు కూడా మా వైద్యసేవలతో కోలుకుని ఇళ్లకు వెళ్లారు. అయితే అనుహ్యంగా అగ్నిప్రమాద ఘటనతో మా ప్రయత్నాలన్నీ నిష్పలమయ్యాయి’ అని రమేశ్బాబు ఆవేదన వ్యక్తం చేశారు.