ఆల్టైం గరిష్ఠానికి మార్కెట్ సంపద
ABN , First Publish Date - 2021-05-08T08:41:40+05:30 IST
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో పయనించాయి. కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాలతో పాటు అంతర్జాతీయ మార్కెట సంకేతాలు సానుకూలంగా
రూ.211 లక్షల కోట్లకు బీఎ్సఈ మార్కెట్ క్యాప్
మూడో రోజూ లాభపడ్డ ప్రామాణిక సూచీలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో పయనించాయి. కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాలతో పాటు అంతర్జాతీయ మార్కెట సంకేతాలు సానుకూలంగా ఉండటం, రూపాయి బలోపేతం ఈక్విటీ ట్రేడింగ్కు కలిసివచ్చింది. బీఎ్సఈ సెన్సెక్స్ శుక్రవారం 256.71 పాయింట్లు లాభపడి 49,206.47 వద్దకు చేరుకుంది. మరోవైపు ఎన్ఎ్సఈ నిఫ్టీ 98.35 పాయింట్లు బలపడి 14,823.15 వద్ద స్థిరపడింది. హెచ్డీఎ్ఫసీ షేరు 2.70 శాతం లాభంతో సెన్సెక్స్ టాప్ గెయినర్గా నిలిచింది.
గడిచిన మూడు రోజుల్లో స్టాక్ మార్కెట్ వర్గాల సంపద రూ.4.39 లక్షల కోట్లు పుంజుకుంది. దాంతో బీఎ్సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సరికొత్త ఆల్టైం గరిష్ఠ స్థాయి రూ.211 లక్షల కోట్ల ఎగువకు చేరుకుంది. దేశంలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12.24 లక్షల కోట్ల ఎగువకు చేరుకుంది. రెండో స్థానంలో ఉన్న టీసీఎస్ మార్కెట్ విలువ రూ.11.58 లక్షల కోట్లుగా నమోదైంది.