దేశీయ సరఫరాకే ప్రాధాన్యం
ABN , First Publish Date - 2020-04-02T05:39:18+05:30 IST
పరిస్థితులు అనుకూలించే వరకూ ఔషఽధ ఎగుమతులపై వేచి చూడడం తప్ప వేరే మార్గం లేదని, ఎగుమతులకన్నా దేశీయ అవసరాలకు ఔషధాలు అందించడం ముఖ్యమని
ఫార్మా ఎగుమతిదారులతో జయేశ్ రంజన్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): పరిస్థితులు అనుకూలించే వరకూ ఔషఽధ ఎగుమతులపై వేచి చూడడం తప్ప వేరే మార్గం లేదని, ఎగుమతులకన్నా దేశీయ అవసరాలకు ఔషధాలు అందించడం ముఖ్యమని తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. తెలంగాణ ఎగుమతులు, దిగుమతుల వ్యాపారంపై లాక్డౌన్ ప్రభావాన్ని వెబ్నార్ ద్వారా సమీక్షించడానికి ఎఫ్టీసీసీఐ, ఫిక్కీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఔషధాల ఎగుమతుల పునరుద్ధరణకు చర్యలు చేట్టాలని వివిధ కంపెనీల ప్రతినిధులు కోరగా దేశీయ ప్రజల అవసరాలు తప్ప ప్రస్తుతానికి ఎగుమతుల గురించి ఆలోచించలేమని స్పష్టం చేశారు.
కోవిడ్-19 వైరస్ నేపథ్యంలో 26 రకాల యాంటీ బయాటిక్స్, విటమిన్లు, హార్మోన్ల ఎగుమతులను కేంద్రం నిషేధించింది. మాస్క్లు వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులకు కొరతగా ఉందని.. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో కీలకమైన ఈ పరికరాల కొరత ఉందని జయేశ్ అన్నారు. దేశీయంగా కొన్ని కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. చైనా నుంచి భారత్కు కార్గో షిప్పులు, ఫ్లైట్లను అనుమతించనంత వరకూ కొన్ని ఇబ్బందులు తప్పవు. దీనిపై కేంద్రంతో చర్చిస్తున్నామని తెలిపారు.