ప్రజల చేతుల్లోనే.. ‘మూడో’ ముప్పు

ABN , First Publish Date - 2021-08-04T08:59:06+05:30 IST

కరోనా మూడోవేవ్‌ రావా లా.. వద్దా.. అనేది ప్రజల చేతుల్లోనే ఉందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు అన్నారు.

ప్రజల చేతుల్లోనే..  ‘మూడో’ ముప్పు

కొనసాగుతున్న సెకండ్‌ వేవ్‌.. డెల్టా వేరియంట్‌తో పెను గండం

డాక్టర్‌ గడల శ్రీనివాసరావు 


హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : కరోనా మూడోవేవ్‌ రావా లా.. వద్దా.. అనేది ప్రజల చేతుల్లోనే ఉందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు అన్నారు. మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెలలోనే మూడో వేవ్‌ వస్తుందన్న అధ్యయన నివేదికలపై స్పందించారు. వైరస్‌ వ్యాప్తి తీరు అనేది ప్రజల ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని గడల పేర్కొన్నారు. డెల్టా వేరియంట్‌ మనదేశంలో సెకండ్‌వేవ్‌ రూపంలో ఇంకా వ్యాపిస్తోందని తెలిపారు. గత ఆరు నెలలుగా దేశంలో రెండోవేవ్‌ కొనసాగుతోందన్నారు. 40 శాతం కొవిడ్‌ ఇన్ఫెక్షన్లకు డెల్టా వేరియంటే కారణమవుతోందని చెప్పారు. డెల్టా ప్లస్‌ కంటే  డెల్టా వేరియంట్‌ వల్లే ఎక్కువ ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు.


ఇప్పటికే 60 శాతం జనాభా డెల్టా వేరియంట్‌కు ఎక్స్‌పోజ్‌ అయ్యారని తెలిపారు. అమెరికా సహా పలు దేశాల్లో డెల్టా వేరియంట్‌ ఉధృతి పెరిగినా.. విస్తృత వ్యాక్సినేషన్‌ వల్ల అక్కడి ప్రజలకు లభించిన రోగ నిరోధక రక్షణతో కొవిడ్‌ మరణాలు చాలా తక్కువగా సంభవిస్తున్నాయని అన్నారు. మన రాష్ట్రంలో కూడా ఇప్పటికే 1.50 కోట్ల మందికి టీకాలు ఇచ్చామని డీహెచ్‌ వెల్లడించారు. దీంతో 50 శాతం మంది ప్రజలకు కొంతమేరకు రక్షణ వచ్చిందన్నారు. పెళ్లిళ్లు, అంత్యక్రియలు, వేడుకలు వంటి సామూహిక కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో అక్కడక్కడ ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు వివరించారు. 

Updated Date - 2021-08-04T08:59:06+05:30 IST