దుబాయ్ రాఫెల్లో భారతీయుడికి జాక్పాట్ !
ABN , First Publish Date - 2021-04-08T15:08:27+05:30 IST
దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్లో భారత వ్యక్తి జాక్పాట్ కొట్టాడు.
యూఏఈ: దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్లో భారత వ్యక్తి జాక్పాట్ కొట్టాడు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉద్యోగి అయిన కేరళకు చెందిన జార్జ్ థామస్(43) ఏకంగా ఒక మిలియన్ డాలర్లు(సుమారు రూ.7.43కోట్లు) గెలుచుకున్నాడు. గత పదేళ్లుగా షార్జాలో నివాసం ఉంటున్న థామస్ మార్చి 14న కొనుగోలు చేసిన 2016 నెంబర్ గల లాటరీ టికెట్కు ఈ జాక్పాట్ తగిలింది. ఆరేళ్లుగా ఆయన ఈ రాఫెల్లో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఎట్టకేలకు ఆయన ఆరేళ్ల నిరీక్షణ ఫలించింది. తాజాగా థామస్కు అదృష్టం వరించడంతో రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. తాను రాఫెల్లో గెలిచిన ఈ భారీ మొత్తాన్ని తన ముగ్గురు పిల్లల కోసం వినియోగిస్తానని థామస్ తెలిపాడు. ఇక 1999లో ప్రారంభమైన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్లో ఒక మిలియన్ డాలర్లు గెలుచుకున్న 179వ భారతీయుడు థామస్. అంతేగాక ఇప్పటి వరకు ఈ రాఫెల్ టికెట్ కొనుగోలుదారులలో భారతీయులే అధికంగా ఉన్నట్లు సమాచారం.