కెల్విన్, జీషాన్అలీ పార్టీల్లో తెలుసు
ABN , First Publish Date - 2021-09-16T08:09:12+05:30 IST
స్నేహితులతో కలిసి హైదరాబాద్లో కొన్ని పార్టీల్లో తాను పాల్గొన్నానని, డ్రగ్స్ కేసుల్లో నిందితులైన కెల్విన్, జీషాన్ అలీ అక్కడే తెలుసునని, అయితే వారితో తనకు ఆర్థిక సంబంధాలు లేవని..
ఆ ఇద్దరితో ఆర్థికసంబంధాల్లేవు.. ఈడీ విచారణలో ముమైత్
హైదరాబాద్, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): స్నేహితులతో కలిసి హైదరాబాద్లో కొన్ని పార్టీల్లో తాను పాల్గొన్నానని, డ్రగ్స్ కేసుల్లో నిందితులైన కెల్విన్, జీషాన్ అలీ అక్కడే తెలుసునని, అయితే వారితో తనకు ఆర్థిక సంబంధాలు లేవని ఈడీ అధికారులకు సినీనటి ముమైత్ ఖాన్ చెప్పారు. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో ముమైత్ విచారణకు హాజరయ్యారు. తన బ్యాంక్ ఖాతాల స్టేట్మెంట్లను అధికారులకు ఆమె సమర్పించారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విచారణ కొనసాగింది. 7 గంటల పాటు ముమైత్ను ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో కీలక నిందితులైన కెల్విన్, జీషాన్ అలీతో గల ఆర్థికసంబంధాలపై విచారించారు. తన బ్యాంక్ స్టేట్మెంట్లలోని అనుమానాస్పద లావాదేవీలపై ఆమె నుంచి వివరణ తీసుకున్నారు. కాగా, ముమైత్ బ్యాంక్ ఖాతా నుంచి ఎఫ్-క్లబ్కు నగదు బదిలీ అయినట్లుగా ఈడీ గుర్తించింది. అవి పార్టీలకు సంబంధించిన లావాదేవీలేనని ఆమె వివరణ ఇచ్చినట్లుగా తెలిసింది. ఇప్పటికే ముమైత్ ఖాన్ సహా పూరి జగన్నాథ్, చార్మికౌర్, రకుల్ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, నందు, రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్-క్లబ్ జీఎంను ఈడీ ప్రశ్నించింది. ఇక తనీశ్, తరుణ్ మిగిలి ఉన్నారు. తనీశ్ గురువారం విచారణకు హాజరుకానున్నారు. 22న తరుణ్ను ఈడీ అధికారులుప్రశ్నిస్తారు.