పల్లెల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్సీ
ABN , First Publish Date - 2021-12-01T05:14:59+05:30 IST
పల్లెల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్సీ
కడ్తాల్: రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలకు సమాంతరంగా పల్లెలను అభివృద్ధి చేస్తోందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని మైసిగండి గ్రామంలో శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ఎమ్మెల్సీ నిధులతో రూ.10లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు పనులను మంగళవారం ఎంపీపీ కమ్లీమోత్యనాయక్, వైస్ఎంపీపీ బావండ్లపల్లి ఆనంద్లతో కలిసి ఎమ్మెల్సీ శంకుస్థాపన చేశారు. అంతకు ముందు కసిరెడ్డి దంపతులు మైసిగండి దేవాలయాన్ని సందర్శించి మైసమ్మ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికై తొలిసారిగా మైసిగండి ఆలయానికి వచ్చిన నారాయణరెడ్డికి ఆలయ అర్చకులు, టీఆర్ఎస్ నాయకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఫౌండర్ ట్రస్టీ రామావత్ సిరోలిపంతూ ఎమ్మెల్సీని సత్కరించారు. ఈసందర్బంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా, దర్శనీయ స్థలంగా, పర్యాటకప్రాంతంగా తీర్చిదిద్దేందుకు తన వంతు తోడ్పాటునందిస్తానని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు. తండాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఎమ్మెల్సీగా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల అభివృద్దికి, ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రధానంగా సాగునీటి కల్పనకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు గూడూరు భాస్కర్రెడ్డి, శేఖర్గౌడ్, హన్మనాయక్, జహంగీర్అలీ, చందోజీ, మోత్యనాయక్, శ్రీకాంత్రెడ్డి, యాదగిరిరెడ్డి, తాళ్ల రవీందర్, రాములు పాల్గొన్నారు.