ట్రంప్కు ఓటేయలేదో.. మీ పని పడతాం!
ABN , First Publish Date - 2020-10-24T01:22:13+05:30 IST
అమెరికా అధ్యక్ష ఎన్నిలకు సమయం దగ్గరపడిన తరుణంలో అమెరికా నిఘా వర్గాలు సంచలన విషయాన్ని ప్రకటించాయి. ఓటర్లను ప్రభావితం చేయడానికి రష్యా, ఇరాన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయని అమెరికా నిఘా వ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నిలకు సమయం దగ్గరపడిన తరుణంలో అమెరికా నిఘా వర్గాలు సంచలన విషయాన్ని ప్రకటించాయి. ఓటర్లను ప్రభావితం చేయడానికి రష్యా, ఇరాన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయని అమెరికా నిఘా వర్గాలు తాజాగా వెల్లడించాయి. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులకు అనుమాస్పద ఈమెయిల్ సందేశాలు వస్తున్నాయి. ‘ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు ఓటేయకుంటే మీ అంతుచూస్తాం. ఎన్నికలు పూర్తైన వెంటనే మీ పని పడతాం’ అని ‘ప్రౌడ్ బాయ్స్’ అనే సంస్థ పేరిట సందేశాలు వస్తున్నాయి.
అయితే ఈ సందేశాల వెనక ఇరాన్ హస్తం ఉందని.. ట్రంప్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోందని అమెరికా నేషనల్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ మీడియా సమావేశంలో ఆరోపించారు. అభ్యర్థుల గెలుపు-ఓటములను ప్రభావితం చేసే రాష్ట్రాల్లోని ఓటర్లకే ఈ మెయిల్స్ ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా అమెరికా ఓటర్ల జాబితా.. ఇరాన్, రష్యాల చేతుల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఈ ఆరోపణలపై ఇరాన్ స్పందించి.. అమెరికా నిఘా వర్గాల ప్రకటనను ఖండించింది. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేసింది. 2016 ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని.. ట్రంప్ గెలుపునకు కృషి చేసిందనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా నిఘా వర్గాల తాజా ప్రకటన ఆ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.