మెరుగైన విద్యనందించాలి
ABN , First Publish Date - 2021-10-23T04:40:33+05:30 IST
మెరుగైన విద్యనందించాలి
- మేడ్చల్ బడి డాట్ కామ్ వెబ్సైట్ను ప్రారంభించిన తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన
(ఆంధ్రజ్యోతి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మెరుగైన విద్యను అందించాలని తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన అన్నారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా విద్యాశాఖ రూపొందించిన మేడ్చల్ బడి డాట్ కామ్ వెబ్సైట్ను ఆమె ప్రారంభించారు. ఇప్పటికే 6 తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులతో పాటు, మేడ్చల్ బడి డాట్ కామ్ ద్వారా అన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా విద్యాశాఖ మరో అడుగు ముందుకేసి తొలిసారిగా మూడో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులు కూడా ప్రత్యక్ష తరగతులతోపాటు అన్లైన్లో పాఠాలు వినడానికి వెబ్సైట్ను రూపొందించిందన్నారు. ప్రాథమిక స్థాయిలో అన్లైన్ పాఠాలు ఒక్క మేడ్చల్ జిల్లాలోని విద్యార్థులు వినడానికి మాత్రమే అవకాశం లభించిందన్నారు. వినూత్న ప్రయత్నాలు చేసిన జిల్లా విద్యాధికారి ఎన్ఎ్సఎస్ ప్రసాద్, సిబ్బందిని దేవసేన అభినందించారు.