మంత్రి అవినీతిపై ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకోరేం? : అయ్యన్న

ABN , First Publish Date - 2020-09-24T18:10:39+05:30 IST

ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి జయరాం మీద చర్యలు తీసుకోవాలని ఏసీబీకి

మంత్రి అవినీతిపై ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకోరేం? : అయ్యన్న

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి జయరాం మీద చర్యలు తీసుకోవాలని ఏసీబీకి ఆధారాలతో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, టీడీపీ నేతలతో కలిసి అయ్యన్న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అయ్యన్న మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి జయరాం, జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కార్మిక శాఖ మంత్రి జయరాం తనయుడు ఈశ్వర్ అవినీతిపై తాను ఆధారాలతో బయట పెట్టానన్నారు. ఒక వ్యాపారస్తుడు అంత ఖరీదైన కారు ఎందుకు బహుమతి ఇచ్చారో చెప్పాలని మీడియా ముఖంగా మరోసారి ఆయన డిమాండ్ చేశారు.


స్పందించరేం..!?

రాష్ట్రం లో అవినీతి జరిగితే క్షమించనన్న ముఖ్యమంత్రి ఇప్పుడేమయ్యారు. అవినీతిపై ఫిర్యాదు చేయడానికి ఫోన్ నంబర్లు ఇచ్చారు. ఇదివరకే నేను కాల్ సెంటర్‌కి ఫోన్ చేసి పిర్యాదు చేశాను కానీ ఇంతవరకు స్పందన లేదు.ఈఎస్ఐ కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తితో మంత్రి, ఆయన తనయుడు ఫోటో ఎందుకు దిగారు. ఈఎస్ఐ కేసులో మంత్రి అవినీతి చేశారని ఆధారాలు చూపించినా ఎందుకు స్పందించడం లేదు..?. ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవలసింది పోయి మంత్రిని కాపాడాలని చూస్తున్నారు. అచ్చంనాయుడిని ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్టు చేశారు. మేము అవినీతికి పాల్పడ్డారని ఆధారాలు చూపిస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. మంత్రి జయరాంని వెంటనే మంత్రి పదవి నుంచి తొలిగించాలి.ఏసీబీపై మాకు నమ్మకం ఉంది. అచ్చెన్న కేసులో ఒత్తిడులు వచ్చినా ఏసీబీ అధికారులు నిజాయితీగా పని చేశారు. ఏసీబీ వద్ద న్యాయం జరగకపోతే గవర్నర్‌ను కలుస్తాం అని అయ్యన్న చెప్పుకొచ్చారు.



నాకు పరిచయాల్లేవ్..!

మంత్రి జయరాంకు నాకు ఎలాంటి పరిచయం లేదు. వ్యక్తిగతంగా కక్ష సాధించవలసిన అవసరం నాకు లేదు. రెండు కోట్లతో కొన్న కంప్యూటర్లు ఎక్కడ ఉన్నాయో మంత్రి చెప్పాలి..?. వివాదాల ఫైలు జిల్లా కార్యాలయాలులో ఉండవలసిన ఫైళ్లు కేంద్ర కార్యాలయంలో ఎందుకు ఉన్నాయి. ఈఎస్ఐ నిధులను ఏం చేస్తున్నారో తెలియడం లేదు. రూ. 450 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో చెప్పాలి అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.


Updated Date - 2020-09-24T18:10:39+05:30 IST