వైసీపీకి కీలక నేత రాజీనామా.. త్వరలో జాతీయ పార్టీలోకి..

ABN , First Publish Date - 2021-04-03T19:11:02+05:30 IST

వైసీపీకి ఊహించని షాక్ తగిలింది.

వైసీపీకి కీలక నేత రాజీనామా.. త్వరలో జాతీయ పార్టీలోకి..

హైదరాబాద్ : తెలంగాణలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ వైసీపీ అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కీలక నేత గట్టు శ్రీకాంత్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు శనివారం నాడు మీడియా మీట్ నిర్వహించి తాను ఎందుకు రాజీనామా చేస్తున్నాననే విషయంపై నిశితంగా మాట్లాడారు. అనంతరం తన రాజీనామా లేఖను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా.. తెలంగాణలో వైసీపీని విస్తరించే ఆలోచన లేదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బరువెక్కిన గుండెతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు గట్టు ప్రకటించారు. వైఎస్ జగన్ భవిష్యత్‌లో ఇంకా గొప్ప స్థానాలు అధిరోహించాలని  కోరుకుంటున్నట్లుగా శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.


ఒక సామాన్య కార్యకర్తను రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించిన గొప్ప వ్యక్తి జగన్ అంటూ కొనియాడిన గట్టు.. ఇవాళ తన జీవితంలో దుర్దినం అని భావోద్వేగానికి లోనయ్యారు. తనకు 2007 నుంచి జగన్‌తో పరిచయం ఉందని.. అప్పుడు కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి నేటి వరకు ఆయనపై ఉన్న నమ్మకంతో.. అతని వెంటే నడిచానని చెప్పుకొచ్చారు. త్వరలోనే తాను జాతీయ పార్టీలో చేరాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంతేకాదు.. భవిష్యత్తులో జాతీయ పార్టీ తరఫునే హుజుర్ నగర్‌ ఎమ్మెల్యేగా పోటీకి దిగుతానని తెలిపారు. వైఎస్ షర్మిల పార్టీ గురించి మాట్లాడిన ఆయన.. ఈ సందర్భంగా.. ‘షర్మిల పార్టీని ఆహ్వానిస్తున్నా.. ఆమెతో విభేదాలు లేవు.. బెస్ట్ ఆఫ్ లక్’ అని తెలిపారు. అయితే ఆయన మళ్లీ తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారా..? లేకుంటే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా..? అని అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు, అనుచరులు సర్వత్రా ఎదురుచూస్తున్నారు.



Updated Date - 2021-04-03T19:11:02+05:30 IST