గుంటూరు జిల్లాలో రైతుల ధర్నా
ABN , First Publish Date - 2020-05-26T20:17:05+05:30 IST
రాజుపాలెం మండలం, రెడ్డిగూడెం, వెంకటేశ్వర కోల్డ్స్టోరేజ్ దగ్గర రైతులు మళ్లీ ధర్నాకు దిగారు.
గుంటూరు జిల్లా: రాజుపాలెం మండలం, రెడ్డిగూడెం, వెంకటేశ్వర కోల్డ్స్టోరేజ్ దగ్గర రైతులు మళ్లీ ధర్నాకు దిగారు. నష్టపరిహారంపై యాజమాన్యం నుంచి స్పష్టతలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. వారం రోజుల క్రితం వెంకటేశ్వర కోల్డ్స్టోరేజ్లో ఏసీలు పనిచేయకపోవడంతో నిలువ చేసిన మిర్చి బస్తాలు బూజు పట్టి పాడయ్యాయి. దీనిపై రైతులు ఆందోళన చేపట్టినప్పుడు యాజమాన్యం స్పందించలేదు. పోలీసులు ఇచ్చిన హామీతో ఆ రోజు రైతులు ఆందోళన విరమించారు.
లాక్ డౌన్ నేపథ్యంలో క్రయవిక్రయాలు లేకపోవడంతో రైతులు వెంకటేశ్వర కోల్డ్స్టోరేజ్లో మిర్చి నిలువ చేశారు. ఏసీలు పనిచేయకపోవడం, యాజమాన్యం దృష్టి సారించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిగిలిన మిర్చి బస్తాలను బయటకు తీసుకువద్దామని మంగళవారం రైతులు వెంకటేశ్వర కోల్డ్స్టోరేజ్కు వద్దకు వచ్చారు. అయితే తాళాలు లేకపోవడం.. యాజమాన్యం స్పందించకపోవడంతో రైతులు మరోసారి ఆందోళన చేపట్టారు. యాజమాన్యం దిగొచ్చి, తమకు నష్టపరిహారం చెల్లించేవరకు సమ్మె కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.