‘వర్రీ’షకాలం!

ABN , First Publish Date - 2020-10-20T06:05:20+05:30 IST

వర్షం పిలస్తే పలికేలా కురుస్తోంది! ఈ ఏడాది జూన్‌ నుంచి అక్టోబరు వరకు కొన్ని రోజులు మినహాయిస్తే మిగతా అన్ని రోజులు వర్షాలు కురిశాయి. కురుస్తూనే ఉన్నాయి

‘వర్రీ’షకాలం!

ఎడతెరిపి లేని వానలతో రైతులు అతలాకుతలం

చేతికొచ్చిన వరి నేలపాలు..పత్తిదీ అదే పరిస్థితి

కొట్టుకుపోయిన మిరప మొక్కలు, పొలాల్లో ఇసుక మేటలు

ప్రభుత్వ సాయంపైనే అన్నదాతల ఆశలు


కరకగూడెం, అక్టోబరు 19: వర్షం పిలస్తే పలికేలా కురుస్తోంది! ఈ ఏడాది జూన్‌ నుంచి అక్టోబరు వరకు కొన్ని రోజులు మినహాయిస్తే మిగతా అన్ని రోజులు వర్షాలు కురిశాయి. కురుస్తూనే ఉన్నాయి. అది కూడా మిన్నుమన్ను ఏకం అయ్యేలా! వరద ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, చెరువులు నెలల తరబడి అలుగులు పోస్తున్నాయి. వరద నీరు ముంచెత్తుతుండటంతో పంటపొలాలు నీటమునిగాయి. చేతికొచ్చిన వరి నేలపాలయింది. సేకరించేందుకు సిద్ధంగా ఉన్న పత్తి నీటమునిగింది. పూత దశలో ఉన్న మిరప మొక్కలు కొట్టుకుపోయాయి. పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. వందల కొద్దీ ఎకరాల్లో వరి నేలవాలింది. ముఖ్యంగా మండలంలోని కలవలనాగారం, పద్మాపురం, తాటాగూడెం, అనంతారం, చిరుమళ్ళ, భట్టుపల్లిలో వరికి తీవ్రనష్టం వాటిల్లింది. 


సన్న రైతులు చిన్నబోయారు

ఈఏడు ప్రభుత్వం వరిలో సన్నరకాలు మాత్రమే సాగు చేయాలని చెప్పడంతో రైతులూ అదే చేశారు. మొదట్లో వరి ఏపుగానే పెరిగింది. చీడపీడలు ఆశించడంతో రైతులు స్థోమతకు మించి సస్యరక్షణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం వరి కంకి దశలో ఉంది. ఇంకో పదిహేను రోజుల్లో పంట చేతికి వస్తుందనగా గాలదుమారంతో కూడిన వర్షాలు కురవడంతో పంట మొత్తం నేలవాలింది. ఉన్న ఆ కాస్త పంటనైనా కాపాడుకుందామంటే అందులోనూ మోకాలి లోతు నీళ్లు నిలిచాయి. వరద నీటిని బయటకు పంపిద్దామని కాలువలు తవ్వినా భూమి ఊటలు ఊరుతున్నాయని రైతులు చెబుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్క వరే కాదు పత్తి, మిరప ఇలా ప్రతీ పంట వర్షాలకు తుడిచిపెట్టుకుపోయాయి. గతంలో కురిసిన వర్షాలకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. కానీ ఇంత వరకూ పరిహారం రాలేదు. మొన్నటి వర్షాలకూ భారీగానే పంట నష్టం వాటిల్లింది. కానీ ఇంత వరకూ అఽధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించలేదు. వర్షాల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతు న్నారు.


నష్ట పరిహారం అందించాలి: పులి రవీందర్‌, రైతు, కలవలనాగారం 

పది ఎకరాల్లో వరి సాగు చేశాను. కొద్ది రోజుల్లో కోతకు వచ్చేది. వర్షాలు, గాలులతో నాకు ఉన్న పది ఎకరాల్లో వరి మొత్తం నేలపాలయింది. రూ. వేలు పెట్టుబడి పెట్టాను. నేల మట్టం అయిన పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. భారీగా నష్టం జరిగింది. ప్రభుత్వం, అధికారులు స్పందించి పరిహారం అందించాలి.


చేతికొచ్చిన పంట నీటిపాలు: శ్రీధర్‌, రైతు, కలవలనాగారం

రూ. వేల పెట్టుబడులు పెట్టాను. పంట చేతికి వచ్చే దశలో వర్షాలు, ఇదురు గాలులతో పంట నేలపాలయ్యింది. ఆశించిన మేర ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం లేదు. కింద పడ్డ వరి కంకులు తాలవుతాయి. అధికారులు స్పందించి పొలాలను పరిశీలించి నష్టపరిహారం అందించాలి.

Updated Date - 2020-10-20T06:05:20+05:30 IST