వరికి నీరివ్వండి.. లేదంటే ఆత్మహత్యే గతి!
ABN , First Publish Date - 2021-04-09T08:28:00+05:30 IST
కడెం చివరి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ఆ రైతులు హెచ్చరించారు. వచ్చే రైతు బీమా డబ్బుతో అప్పులు తీర్చుకుంటామని
వచ్చే బీమాతో అప్పులు తీర్చుకుంటాం..
పురుగు మందు డబ్బాలతో అన్నదాతల నిరసన
మంచిర్యాల జిల్లా దండేపల్లిలో రాస్తారోకో..
వరంగల్ జిల్లాలో ఎండిన పైరుకు రైతు నిప్పు
వచ్చే బీమాతో అప్పులు తీర్చుకుంటాం..
దండేపల్లి, భీమరదేవపల్లి, ఏప్రిల్ 8: కడెం చివరి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ఆ రైతులు హెచ్చరించారు. వచ్చే రైతు బీమా డబ్బుతో అప్పులు తీర్చుకుంటామని ప్రకటించారు! మంచిర్యాల జిల్లా దండేపల్లిలో రైతులు వ్యక్తం చేసిన నిరసన ఇదీ. పొట్టదశకు వచ్చిన వరి పంట నీళ్లు లేక ఎండుతోందని.. వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం పురుగు మందు డబ్బాలతో రైతులు, కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కడెం చివరి ఆయకట్టు రైతులమైన తాము వర్షాకాలంలోనూ పంటలకు సాగునీరు అందక నష్టపోయామని, కనీసం ఈ సారైనా రెండు తడులకు గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలని పాతమామిడిపలి, కొత్త మామిడిపల్లి, దండేపల్లి, నర్సాపూర్ గ్రామాల రైతులు డిమాండ్ చేశారు.
అధికారులు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ చివరి వరకు కడెం ప్రాజెక్టు నుంచి నీరు ఇవ్వాల్సి ఉండగా ప్రాజెక్టులో నీటిమట్టం లేదని సాకు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకుంటే తమకు ఆత్మహత్యే గతి అని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ హన్మంతరావు, నీటి పారుదల శాఖ ఏఈ రాజేందర్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తామని నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మరోవైపు దేవాదుల చివరి ఆయకట్టుకు సాగునీరు అందక వరి పైర్లు ఎండిపోతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్, గాంధీనగర్, పెంచికల్పేట, దమ్మక్కపేట పొలాలకు నీరు అందడం లేదు. సాగునీరు అందించాలని విన్నవించినా అధికారులు స్పందించలేదు. వరి పైరు నిలువునా ఎండిపోవటంతో బండారి లక్ష్మయ్య అనే రైతు తన ఎకరం వరి పొలానికి నిప్పు పెట్టాడు.