కొవిడేతర వైద్య సేవలపై దృష్టి సారించండి
ABN , First Publish Date - 2021-12-01T05:23:51+05:30 IST
కొవిడేతర వైద్య సేవలపై దృష్టి సారించండి
- కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు ప్రారంభించాలి
- సమీక్షలో ఎన్వీబీడీసీపీ అదనపు డైరెక్టర్ డాక్టర్ అమర్సింగ్నాయక్ ఆదేశం
(ఆంధ్రజ్యోతి, వికారాబాద్ జిల్లా ప్రతినిధి): వైద్య సిబ్బంది కొవిడ్ నియంత్రణ చ ర్యలతో పాటు కొవిడేతర వైద్య సేవలపై కూ డా దృష్టి సారించాలని జాతీయ కేంద్ర కీటక జనక వ్యాధుల నియంత్రణ కార్యక్రమ(ఎన్వీబీడీసీపీ) అదనపు డైరెక్టర్ డాక్టర్ అమర్సింగ్ నాయక్ ఆదేశించారు. మంగళవారం ఆయన డీఎంహెచ్వో కార్యాలయాన్ని సందర్శించి మ లేరియా, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో దోమల నిర్మూలన చర్యలు వేగవంతం చేయాలని, ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలని, నిల్వ ఉన్న నీటిని పారపోసి దోమలు వృద్ధి కాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ వ్యాధులకు కారణమవుతాయన్నారు. జిల్లాలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు ప్రారంభించాలని, కరోనా నిబంధనలు, తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఈ శస్త్ర చికిత్సలు చేయాలని సూచించారు. కొవిడ్ ఉధృతి కారణంగా రెండేళ్లుగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయన్నారు.టగతంలో నిర్వహించిన మాదిరిగానే జిల్లాలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించాలని, ఒక శిబిరంలో పరిమిత సంఖ్యలో 25 నుంచి 30 శస్త్ర చికిత్సలు నిర్వహించాలన్నారు. శస్త్ర చికిత్సలకు వచ్చే వారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని, నెగటివ్ వస్తేనే శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. ఆస్పత్రులకు జ్వరంతో ఎవరైనా వస్తే వారి నుంచి రక్త నమూనాలు సేకరించి డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపి పరీక్షలు చేయిస్తే జ్వరానికి కారణమేమిటనేది తెలుస్తుందన్నారు. దాంతో చికిత్స సులభమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో మలేరియా, ఫైలేరియా, డెంగీ వ్యాధుల ప్రభావం, నివారణ చర్యలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో కుటుంబ నియంత్రణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీదేవి, మలేరియా డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్వో తుకారాం భట్ పాల్గొన్నారు.