మరోసారి భారతీయ అమెరికన్లకు Joe Biden పెద్ద పీఠ.. నలుగురికి కీలక బాధ్యతలు!
ABN , First Publish Date - 2021-12-22T21:50:35+05:30 IST
మొదటి నుంచి భారతీయ అమెరికన్లకు ప్రాధాన్యం ఇస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తన ప్రభుత్వంలో నలుగురికి కీలక బాధ్యతలు అప్పగించారు.
అడ్వైజరీ కమిషన్లో నలుగురు భారతీయ అమెరికన్లకు చోటు
వాషింగ్టన్: మొదటి నుంచి భారతీయ అమెరికన్లకు ప్రాధాన్యం ఇస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తన ప్రభుత్వంలో నలుగురికి కీలక బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆసియా అమెరికన్లు, నేటివ్ హవాయన్స్ సహా పసిఫిక్ దీవులకు (ఏఏఎన్హెచ్పీఐ) చెందిన వారి కోసం ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిషన్లో నలుగురు భారతీయ అమెరికన్లను నియమించారు. ఈ మేరకు వైట్హౌస్ సోమవారం ప్రకటించింది. మొత్తం 23 మంది సభ్యులు ఉండే ఈ అడ్వైజరీ కమిషన్లో ఇండో అమెరికన్స్ అయిన సోనాల్ షా, స్మితా షా, అజయ్ భుటోరియా, కమల్ కాల్సిలకు చోటు కల్పిస్తున్నట్లు అధ్యక్ష భవనం తన ప్రకటనలో పేర్కొంది. ఆసియా అమెరికన్లు, నేటివ్ హవాయన్, పసిఫిక్ దీవులకు చెందిన వారి సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై అధ్యక్షుడికి ఈ కమిషన్ సూచనలు చేస్తుంది.
ఇక డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆర్థిక వేత్త సోనాల్ షా విద్యారంగంలో విశేష కృషి చేశారు. అలాగే ఇంజినీర్, వ్యాపారవేత్త అయిన స్మితా ఎన్ షా.. చికాగోకు చెందిన స్పాన్ టెక్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ కమల్ సింగ్ కాల్సి అమెరికా సైన్యానికి 20 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఆఫ్గానిస్థాన్లో ఆయన అందించిన సేవలకు గాను ప్రభుత్వం బ్రాన్జ్ స్టార్ మెడల్ను ఇచ్చి ఆయనను గౌరవించింది. సిలికాన్ వ్యాలీలో టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న అజయ్ భుటోరియా ఏషియన్ అమెరికన్స్, పసిఫిక్ ఐలాండర్స్ కోసం కృషి చేశారు. ఇలా నలుగురు వివిధ రంగాల్లో తమకంటు ప్రత్యేక గుర్తింపును పొందారు. దీంతో వీరికి బైడెన్ తన పరిపాలన బృందంలో చోటు కల్పించారు.