వచ్చే నెలలో నాన్ కొవిడ్గా గాంధీ ఆస్పత్రి
ABN , First Publish Date - 2021-06-23T10:49:58+05:30 IST
కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్న నేపధ్యంలో జూలైలో నాన్కొవిడ్గా గాంధీ ఆస్పత్రిని మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
అడ్డగుట్ట, జూన్ 21 ( ఆంధ్రజ్యోతి) : కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్న నేపధ్యంలో జూలైలో నాన్కొవిడ్గా గాంధీ ఆస్పత్రిని మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈమధ్యకాలంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా రావడంతో ఈ నెలలో నాన్ కొవిడ్గా మార్చే ఆలోచన చేయలేకపోయారు. బ్లాక్ ఫంగస్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రా జారావు చెప్పారు. ప్రస్తుతం దాదాపు మూడు వందలపై చిలుకు బ్లాక్ ఫం గస్ రోగులు చికిత్స పొందుతుండగా ప్రతి రోజు పదుల సంఖ్యలో సర్జరీలు చేస్తున్నామని, మూడో అంతస్తులో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశామని, బ్లాక్ ఫంగస్ సర్జరీలపైనే ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గాంధీ వైద్యులతో పాటు ఈఎన్టీ వైద్యులు కూడా బ్లాక్ ఫంగస్ రోగులకు చేసే సర్జరీల్లో పాలుపంచుకుంటున్నారు. కేసులు అధికం కావడంతో తక్కువ సమయంలో బ్లాక్ ఫంగస్ రోగులు ఉపశమనం పొందేందుకు ఓపీతో పాటు సర్జరీలు కూడా సంయుక్తంగా చేస్తున్నారు. బ్లాక్ ఫంగస్ రోగులకు సర్జరీలు చేసే సమయలో ఐదు విభాగాల వైద్యులు చురుకుగా పనిచేస్తున్నారు. ఈఎన్టీ, న్యూరో, అనస్థీషియా, డెంటల్, ప్లాస్టిక్ సర్జన్లు ప్రతి సర్జరీలో పాల్గొంటారు. ఒక్కొక్క సర్జరీకి కనీసం రెండు గంటలు సమయం ప డుతుంది. సైౖనసైటిస్, శ్వాసకోశ, మెదడు, కళ్లకు సంబంధించిన వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు.
చికిత్స కోసం ఎదురుచూస్తున్న సాధరణ రోగులు
గాంధీ ఆస్పత్రిని కొవిడ్ ఆస్పత్రిగా మార్చడంతో సాధారణ రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఆస్పత్రిని నాన్కొవిడ్గా మార్చే రోజు కోసం ఎదురు చూస్తున్నారు. అసలే లాక్డౌన్లో ఉపాధి లేక, చేతిలో పనిలేక ఇంట్లో ఉంటూ కాలం వెళ్ల్లదీసిన సామాన్య ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రులో వైద్యం చేయించుకోలేక చాలా ఇబ్బందులు పడ్డారు. లాక్డౌన్ ముందు గాంధీలో చేరిన రోగులకు వందల సంఖ్యలో సర్జరీలు వాయిదా పడ్డాయి. ఓపీ సేవలు పునఃప్రారంభిస్తే సామాన్యులకు కాస్త ఊరట కలుగుతుంది.