శంషాబాద్‌ విమానాశ్రయంలో..గ్యాస్‌ లీకై కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2021-06-18T08:54:42+05:30 IST

శంషాబాద్‌ అతర్జాతీయ విమానాశ్రయంలో గ్యాస్‌ లీకై ఒక కార్మికుడు మృతిచెందగా.. మరో ఇద్దరు అపస్మారక స్థితికి చేరుకున్నారు.

శంషాబాద్‌ విమానాశ్రయంలో..గ్యాస్‌ లీకై కార్మికుడి మృతి

  • డ్రైనేజీ శుభ్రపరుస్తుండగా ఘటన
  • అపస్మారక స్థితిలో మరో ఇద్దరు.. క్షేమం

శంషాబాద్‌, జూన్‌ 17: శంషాబాద్‌ అతర్జాతీయ విమానాశ్రయంలో గ్యాస్‌ లీకై ఒక కార్మికుడు మృతిచెందగా.. మరో ఇద్దరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి కథనం ప్రకారం.. శంషాబాద్‌ విమానాశ్రయంలోని పైఅంతస్తులో డ్రైనేజీ సమస్యలు ఉండడంతో.. ఫాబెర్‌ సిందూరి ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసె్‌సకు చెందిన నర్సింహారెడ్డి (42), జకీర్‌, ఇలియాస్‌ అనే ప్లంబర్లకు శుభ్రపరిచే పని అప్పగించారు. ఆ ముగ్గురూ గురువారం సాయంత్రం 9.30 సమయంలో.. అరైవల్స్‌ విభాగం బెల్ట్‌ నంబర్‌-4 ప్రాంతంలో సీలింగ్‌ను తొలగించి, పైపులను శుభ్రపరిచే పనిలో నిమగ్నమయ్యారు. పైప్‌లైన్‌లో అడ్డంకులు ఎక్కువగా ఉండడంతో.. యాసిడ్‌ పోశారు. దాంతో.. ఒక్కసారిగా ఘాటైన వాసనలకు తోడు పైప్‌లోన్‌లో పేరుకుపోయిన గ్యాస్‌ లీకైంది. ఈ ఘటనలో ముగ్గురూ ఊపిరాడక, ఉక్కిరిబిక్కిరై అపస్మారక స్థితికి చేరుకున్నారు. నర్సింహారెడ్డి అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. మిగతా ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు.

Updated Date - 2021-06-18T08:54:42+05:30 IST