గ్రేటర్ ప్రచారంలో తలమునకలు
ABN , First Publish Date - 2020-11-23T05:36:14+05:30 IST
గ్రేటర్ ప్రచారంలో తలమునకలు
- జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ శ్రేణులు బిజీబిజీ
- నగరానికి తరలివెళ్లిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు
ఘట్కేసర్/ఘట్కేసర్ రూరల్/ మేడ్చల్ రూరల్: గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు తలమునకలై ఉన్నారు. డిసెంబర్ ఒకటిన జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా హబ్సిగూడ డివిజన్ ఇన్చార్జిగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్రెడ్డి వ్యవహరిస్తున్నారు. దీనితో మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులతోపాటు పార్టీ నాయకులు మండలంలోని ఆయా విభాగాల టీఆర్ఎస్ నాయకులకు సైతం ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించడంతో నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారంలో పాల్గొంటున్నారు. దీనితో ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలతోపాటు చౌదరిగూడ పంచాయతీకి చెందిన ప్రజాప్రతినిఽధులు, పార్టీ నాయకులు మొత్తం నగరంలోనే మకాం పెట్టడంతో మున్సిపాలిటీలతోపాటు మండలంలోనే ఎక్కడా నాయకులు కనిపించడంలేదు. నిత్యం స్థానికంగా సోషల్మీడియాలో కనిపించే వారంతా ప్రస్తుతం నగరంలోని హబ్సిగూడ డివిజన్లో దిగిన ఎన్నికల ప్రచార ఫొటోలతో హల్చల్ చేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు స్థానిక ప్రజలకు కనిపించే అవకాశం లేకుండా పోయింది. గల్లీ నాయకుని నుంచి రాష్ట్ర స్థాయి పార్టీ నాయకులు సైతం నగరంలోనే మకాం పెట్టారు. దీంతో మున్సిపాలిటీలు, మండలం ఖాళీ అయింది. మారో వారం రోజులు ఇదే పరిస్థితి కనిపించనుందని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్రెడ్డి, వైస్ చైర్మన్లు నానావత్ రెడ్డియా నాయక్, పల్గుల మాధవరెడ్డి, మున్సిపాలిటీల టీఆర్ఎస్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, మందడి సురేందర్రెడ్డి, కౌన్సిలర్ రమాదేవి, కో-ఆప్షన్ సభ్యులు ఎస్కే సౌకత్మియా నాయకులు ప్రభాకర్రెడ్డి, సుధాకర్రెడ్డి, రాధాకృష్ణ, శ్రీశైలం, ఎండీ సిరాజ్, హరిశంకర్, కృపానిధి పాల్గొన్నారు. హబ్సిగూడ డివిజన్ టీఆర్ఎస్ ఇన్చార్జి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్రెడ్డి నేతృత్వంలో మండలం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం అధికసంఖ్యలో తరలివెళ్లి ప్రచారం చేశారు. కారుగుర్తు చూపుతూ స్వప్నాసుభాష్రెడ్డిని భారీమెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఓటు అభ్యర్థించారు. మండలం నుంచి ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో హబ్సిగూడకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేష్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కందుల కుమార్, సింగిల్విండో డైరెక్టర్లు, వార్డుసభ్యులు ప్రచారంలో పాల్గొన్నారు. మేడ్చల్ మండలంతో పాటు, గుండ్లపోచంపల్లి, మేడ్చల్ మున్సిపాలిటీల నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. మేడ్చల్ సమీపంలోని జీడిమెట్ల, చింతల్, షాపూర్నగర్, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో మేడ్చల్ టీఆర్ఎస్ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. దీనితో నేతలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ప్రతి రోజు కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. రెండు, మూడు రోజులుగా మేడ్చల్ ప్రాంతం బోసిపోయినట్లుగా కనిపిస్తున్నది. మండలంలో, మున్సిపాలిటీల్లో ఎలాంటి కార్యక్రమాలు లేక సందడి తగ్గిపోయింది. తమ కార్యక్రమాలన్ని కట్టిపెట్టి మరీ నేతలు ప్రచారానికి వెళుతున్నారు.