చిత్తూరులో ఘోరం!

ABN , First Publish Date - 2021-12-06T08:41:15+05:30 IST

చిత్తూరులో ఘోరం!

చిత్తూరులో ఘోరం!

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత

ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనం

ఆసుపత్రిలో మరో ఇద్దరు.. మృతుల్లో 6 నెలల పాప

కాణిపాకం నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం

అదుపుతప్పి.. కల్వర్టును ఢీకొన్న కారు

పెట్రోల్‌ ట్యాంక్‌ పేలడంతో రేగిన మంటలు

మృతులంతా ఉత్తరాంధ్రకు చెందినవారు

అతివేగమే కారణమన్న పోలీసులు

తిరుమల యాత్ర విషాదాంతం

మృత్యుంజయిగా మూడేళ్ల చిన్నారి


తిరుపతి/సంతకవిటి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కొత్త కారు కొనుక్కున్నామన్న ఉత్సా హం, తిరుమల శ్రీవారి దర్శనానికి సకుటుంబ సరిపరివారంగా వెళ్తున్నామన్న ఆనందం క్షణా ల్లో ఆవిరైంది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో శోక సం ద్రాన్ని నింపింది. మరికొద్ది సేప ట్లో తిరుమల చేరుకుంటారనగా సంభవించిన పెను ప్రమాదం.. ఐదుగురిని సజీవ దహనం చేయగా, మరో ఇద్దరిని ఆసుపత్రిలో కబళించింది. మృతుల్లో ఆరు నెలల చిన్నారి ఉండడం అందరినీ కంటతడి పట్టించింది. మూడేళ్ల చిన్నారి మాత్రం ప్రమాదం నుంచి బయటపడింది.


మొక్కు తీర్చుకునేందుకు వెళ్లి..

శ్రీకాకుళం జిల్లా  సంతకవిటి మండలం మేడమర్తి గ్రామానికి చెందిన కంచరాపు సురేశ్‌కుమార్‌(33) చెన్నైలో మెరైన్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. రెండు నెలల కిందట సెలవులకు స్వగ్రామానికి వచ్చిన సురేశ్‌ మరికొద్ది రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంది. ఇటీవలే స్విఫ్ట్‌ డిజైర్‌(ఏపీ 39 హెచ్‌ఏ 4003) కారును కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల కుమార్తె మొక్కు తీర్చుకునేందుకు భార్య మీనా(29), ఇద్దరు పిల్లలు జోష్మిత సహస్ర(6 నెలలు), జషిత నందన్‌(3), తల్లిదండ్రులు సత్యవతి(62), శ్రీరామ్మూర్తి(70) తిరుమల శ్రీవారి దర్శనానికి బయల్దేరారు. వీరితోపాటు విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన సురేశ్‌ అత్తమామలు పైడి హైమావతి(51), పైడి గోవిందరావు(61)లను కూడా అదే కారులో తీసుకువెళ్లారు. మొత్తం 8 మంది శనివారం ఉదయం మేడమర్తిలో ఎంతో సంతోషంగా దైవదర్శనానికి బయలుదేరారు. తొలుత ఆదివారం ఉదయం కాణిపాకం వరసిద్ధి వినాయకుని దర్శించుకుని తిరుమలకు బయలుదేరారు. 


ప్రమాదం ఇలా!

సురేశ్‌ కుమార్‌ కారును స్వయంగా నడుపుతూ ఆదివారం మధ్యాహ్నం 2.55 గంటల సమయంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి మం డలం అగరాల వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిలోకి చేరుకున్నారు. అయితే.. ఇక్కడున్న భారీ మలుపు వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి సర్వీసు రోడ్డుకు మధ్యలో ఉన్న కల్వర్టులోకి దూసుకుపోయింది. ఈ క్రమంలో కారు ముందుభాగం కల్వర్ట్‌ గోడను బలంగా ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు పెట్రోల్‌ ట్యాంక్‌ పగిలిపోయి..  మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగసిపడిన మంటలు కారును చుట్టుముట్టేశాయి. దీంతో కారులో ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. ఈ ఘటనలో మంటలు అలుముకుని సురేశ్‌కుమార్‌, మీనా, జోష్మిత సహస్ర, పైడి గోవిందరావు, సత్యవతిలు సజీవ దహనమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు కారులో చిక్కుకున్న వారిని బయటకులాగారు. వీరిలో తీవ్రంగా గాయపడిన హైమావతి, శ్రీరామమూర్తి, జషిత నందన్‌లను 108 వాహనంలో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే, శ్రీరామమూర్తి, హైమావతిలు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. మొత్తం 8 మంది లో మూడేళ్ల చిన్నారి జషిత నందన్‌ మా త్రం ప్రాణాపాయం నుంచి బయటపడినా ఈ ప్రమాదంలో చిన్నారి కుడి కా లు విరిగి పోయిందని వైద్యులు తెలిపా రు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన స్పందించారు. సమీపంలోని అగరాలకు వెళ్లే తాగునీటి పైపులైన్‌ను పగలగొట్టి ఆ నీటితో మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించారు. కాగా, ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశారు.


పెళ్లయిన నాలుగేళ్లకే..

మెరైన్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సురేశ్‌కుమార్‌కు నాలుగేళ్ల కిందట విజయనగరం జిల్లాకు చెందిన మీనాతో వివాహమైంది. వీరికి మూడేళ్ల జషితతో పాటు ఆరు నెలల కిందటే మరో చిన్నారి జన్మించింది. వృద్ధులైన తల్లిదండ్రులు, అత్తమామలను తీర్థయాత్రలకు తీసుకెళ్లాలని సురేశ్‌ సర దా పడ్డారు. ఈ క్రమంలో కొత్త కారులో బయల్దేరగా ప్రమాదం పొట్టన పెట్టుకుంది. ఈ ఘటన తెలిసి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

Updated Date - 2021-12-06T08:41:15+05:30 IST