తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇవ్వండి
ABN , First Publish Date - 2021-12-01T08:40:05+05:30 IST
రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తాజిల్లాల్లో వరద బాధితులను ఆదుకోవడానికి తక్షణ ఆర్థిక సాయం కింద రూ.1,000 కోట్లు ఇచ్చి ఆదుకోవాలని వైసీపీ ఎంపీ..
- రాజ్యసభలో విజయసాయిరెడ్డి వినతి
న్యూఢిల్లీ, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తాజిల్లాల్లో వరద బాధితులను ఆదుకోవడానికి తక్షణ ఆర్థిక సాయం కింద రూ.1,000 కోట్లు ఇచ్చి ఆదుకోవాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన రాజ్యసభ జీరో అవర్లో వరద పరిస్థితులను ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారీ వర్షాలు, వరదల వల్ల పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయని, ఆస్తినష్టం జరిగిందని, సుమారు 44 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది గల్లంతయ్యారని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ర్టాన్ని ఆదుకోవాలని కోరారు. వరదల కారణంగా దాదాపు లక్షా 85వేల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు, ఉద్యానవనాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.6,054 కోట్ల విలువైన నష్టం జరిగినట్టు గుర్తించామన్నారు.
త్వరలో డెంగీ, టీబీకి వ్యాక్సిన్లు: కేంద్రం
దేశంలో డెంగీ, టీబీ వ్యాధులను నియంత్రించేందుకు ప్రత్యేక వ్యాక్సిన్ను అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. మంగళవారం రాజ్యసభలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. నిపుణుల అనుమతి లభించిన వెంటనే ప్రజలకు వ్యాక్సిన్ను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.