టాటా చేతికి ఎయిరిండియా.. శుద్ధ అబద్ధమన్న కేంద్రం
ABN , First Publish Date - 2021-10-01T21:24:48+05:30 IST
దేశీయ విమాన దిగ్గజమైన ఎయిర్ ఇండియాను టాటా సన్స్ కొనుగోలు చేయనున్నట్టు వస్తున్న వార్తలను
న్యూఢిల్లీ: దేశీయ విమాన దిగ్గజమైన ఎయిర్ ఇండియాను టాటా సన్స్ కొనుగోలు చేయనున్నట్టు వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపడేసింది. ఈ వార్తలు వాస్తవ దూరమని పేర్కొంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడానికి టాటా సన్స్ తుది బిడ్ను దక్కించుకుందని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ కూడా బిడ్ వేశారని, అయితే, ప్రభుత్వ కమిటీ నిర్ణయించిన కనీస ధరకంటే టాటాసన్స్ రూ. 3 వేల కోట్ల అధికంగా బిడ్ వేసినట్టు వార్తలు బయటకొచ్చాయి.
ఈ వార్తలు మీడియాలో షికారు చేస్తున్న కాసేపటికే ప్రభుత్వం స్పందించింది. ఎయిరిండియాను టాటా సన్స్ కొనుగోలు చేయబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. నిర్ణయం తీసుకున్న వెంటనే మీడియాకు తెలియజేస్తామని పేర్కొంది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డీఐపీఏఎం) కార్యదర్శి టుహీన్ కాంత పాండే ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్న వెంటనే మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు.