క్రికెట్ కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయి
ABN , First Publish Date - 2021-10-22T07:38:54+05:30 IST
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వ్యవహారాలు గమనిస్తుంటే క్రికెట్ కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయని సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
హెచ్సీఏ వ్యవహారాలపై సుప్రీం కోర్టు అసహనం
దర్యాప్తు జరిపిస్తామని స్పష్టీకరణ
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వ్యవహారాలు గమనిస్తుంటే క్రికెట్ కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయని సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘క్రికెట్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ స్థానంలోకి రాజకీయాలు ప్రవేశించాయి’ అని వ్యాఖ్యానించింది. హెచ్సీఏ వ్యవహారాలపై త్వరలో దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేసింది. హెచ్సీఏ అంబుడ్స్మన్, ఎథిక్స్ అధికారిగా జస్టిస్ దీపక్ వర్మ నియామకం అంశంలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని బడ్డింగ్ స్టార్ క్రికెట్ క్లబ్, విజయానంద్, హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
గురువారం ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీం లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తితో దర్యాప్తు జరిపిస్తామని తెలిపింది. పదవీకాలం ముగుస్తున్నందున అంబుడ్స్మన్గా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని జస్టిస్ దీపక్ వర్మకు తెలియజేయాల్సిందిగా న్యాయవాదులకు సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసిన ధర్మాసనం.. ఆలోపు హెచ్సీఏపై దర్యాప్తు జరపడానికి కొంత మంది రిటైర్డ్ న్యాయమూర్తుల పేర్లను పరిశీలిస్తామని తెలిపింది.