సీఐడీ చీఫ్ నుంచి తనకు ప్రాణహాని ఉంది; ప్రధానికి రఘురామ ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-01-15T02:05:14+05:30 IST
సీఐడీ చీఫ్ నుంచి తనకు ప్రాణహాని ఉంది; ప్రధానికి రఘురామ ఫిర్యాదు
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ నుంచి తనకు ప్రాణహానీ ఉందని ప్రధానికి రాసిన లేఖలో రఘురామ ఫిర్యాదు చేశారు. జగన్తో కుమ్మక్కై సునీల్ తన ప్రాణానికి హాని తలపెట్టారని అన్నారు. సునీల్ ఆధ్వర్యంలో నడిచే అంబేద్కర్ ఇండియా మిషన్ సంస్థ ద్వారా రాష్ట్రంలో పలు పీఎస్లలో కేసులు నమోదు చేయించారని రఘురామ పేర్కొన్నారు. విచారణకు పిలిచి హతమార్చాలనే ప్రణాళిక రచించారని, గతేడాది మే 14న తనను కస్టోడియల్ టార్చర్కు గురి చేశారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత గుంటూరు జైలుకు పంపి అక్కడే హత మార్చాలని కుట్ర పన్నారని,.. అప్పుడు కుదరక ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నారని రఘురామ ప్రధానికి తెలిపారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు ఎత్తిచూపడంతో భౌతికదాడులకు యత్నిస్తున్నారని,.. తనను హతమార్చే కుట్రలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాలుపంచుకున్నారని రఘురామ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎన్ఐఏ లేదా అదేస్థాయి సంస్థతో విచారణ జరిపించాలని రఘురామ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. గతేడాది జూన్ 2న ఇచ్చిన ప్రివిలేజ్ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని రఘురామ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై లోక్సభ స్పీకర్కు కూడా లేఖ రాశానని ఎంపీ రఘురామ పేర్కొన్నారు.