కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తాం: కేసీఆర్ సర్కార్కు వార్నింగ్
ABN , First Publish Date - 2021-05-11T17:42:36+05:30 IST
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. కరోనా పరీక్షలు తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. కరోనా పరీక్షలు తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరికలు జారీ చేసింది. పాతబస్తీలో నిబంధనలు పాటించడం లేదన్న హైకోర్టు.. లాక్డౌన్ విధిస్తారా? లేదంటే నిబంధనలు కఠినతరం చేస్తారా? అని ప్రశ్నించింది. మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉందని కోర్టుకు ఏజీ తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం లాక్డౌన్, కర్ఫ్యూపై వివరాలు సమర్పిస్తామన్నారు. లాక్డౌన్పై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్డౌన్పై సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆక్సిజన్ ప్రమాదాలపై సరైన వివరణ ఇవ్వాలని హై కోర్టు తెలిపింది. పూర్తి వివరణ ఇవ్వాలంటూ మధ్యాహ్నం 2:30కు విచారణను వాయిదా వేసింది. ఏ రోజైతే తాము ఆదేశాలిచ్చామో.. అదే రోజు ప్రెస్ మీట్లు పెట్టి లాక్డౌన్ అవసరం లేదని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఎలా చెబుతారని హైకోర్టు మండిపడింది. తాము లాక్డౌన్ గురించి పరిశీలించండి అన్నప్పుడు అలాంటిది అవరసం లేదు అని సీఎస్ ఎలా చెబుతారని ప్రశ్నించింది. రంజాన్ పండుగ అయ్యాక ప్రభుత్వం లాక్డౌన్ పెట్టాలనుకుంటుందా? అని హైకోర్టు నిలదీసింది. మధ్యాహ్నం వరకూ ఏజీ సమయం కోరగా.. తదుపరి విచారణను హైకోర్టు మధ్యాహ్నం 2.30 వాయిదా వేసింది.