నేటినుంచి గుర్రంపీరు జాతర

ABN , First Publish Date - 2022-01-28T03:57:32+05:30 IST

కులమతాలకతీతంగా గుర్రంపల్లి జాతర(గుర్రంపీరు)

నేటినుంచి గుర్రంపీరు జాతర
గుర్రంపీరు వద్ద భక్తుల సందడి (ఫైల్‌)

చౌదరిగూడ, జనవరి 27 : కులమతాలకతీతంగా గుర్రంపల్లి జాతర(గుర్రంపీరు) శుక్రవారం ప్రారంభం కానుంది. మొదటిరోజు గంధం అలంకరణ, శనివారం ధూపదీప అలంకరణ, ఆదివారం కందురులు, సోమవారం ఖవ్వాలి కార్యక్రమాలు ఉంటాయి. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలిరానున్నారు. 


జాతర ప్రత్యేకత

మండల పరిధిలోని గుర్రంపల్లిలో ఓ గుర్రం ప్రతి రోజూ రాత్రి శనగ పంటను మేసి వెళ్లేది. అది గమనించిన రైతు ఒకరోజు తన పొలం వద్ద కాపలా ఉన్నాడు. ప్రతిరోజులాగానే గుర్రం రాగానే దానిపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో గుర్రం తోక, మూతి సగ భాగం తెగి పడి కొద్ది దూరంలో పడి రాతి శిలగా మారినట్లు స్థానికులు విశ్వసిస్తారు. అశ్వం శాపనార్థాలతో రైతు అక్కడే రక్తం కక్కి మృతి చెందాడని, అతని సమాధి ఆనవాళ్లు గుర్రం రాతి శిలకు కొద్ది దూరంలోనే ఉండేదని, కాలక్రమేణ నేలమట్టమైందని అంటున్నారు. మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. గ్రామసమీపంలోని సన్యాసిగడ్డ ప్రాంతంలో గోసాయివాళ్లు ఉండేవారు. వాళ్లు గుర్రం ఆకారంలో శిలను తయారుచేసి ప్రతిష్ఠించారని స్థానికులు చెబుతుంటారు. కాలక్రమంలో స్థానికులు ఈ గుర్రం శిలను ఆరాధించడం ప్రారంభించారని చెప్పుకుంటారు. పసి పిల్లలను గుర్రం రాతి విగ్రహం చుట్టూ తిప్పితే ఆరోగ్యంగా ఉంటారని ప్రజల విశ్వాసం. ప్రతి గురువారం వందలాది మంది భక్తులు పసి పిల్లలతో ఇక్కడకు వచ్చి గుర్రాన్ని దర్శించుకుంటారు. 70ఏళ్ల క్రితం మొదట్లో గ్రామస్థులంతా కలిసి నగదు, ధాన్యం పొగేసి జాతర చేసుకునేవారని, అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతుందని స్థానికులు అంటున్నారు. ఇక్కడ లభించే వివిధ రకాల కుమ్మరి కుండలను చాలామంది కొని తీసుకెళ్తుంటారు.



Updated Date - 2022-01-28T03:57:32+05:30 IST