వైద్యుడి పొరపాటు వల్ల కోమాలోకి మహిళ.. రూ. 2.5 కోట్లు చెల్లించమన్న కోర్టు

ABN , First Publish Date - 2021-01-25T19:36:37+05:30 IST

వైద్యుడి పొరపాటు కారణంగా మహిళ కోమాలోకి వెళ్లడంతో రూ. 2.5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ అబూధాబీ కోర్టు తీర్పునిచ్చింది.

వైద్యుడి పొరపాటు వల్ల కోమాలోకి మహిళ.. రూ. 2.5 కోట్లు చెల్లించమన్న కోర్టు

అబూధాబీ: వైద్యుడి పొరపాటు కారణంగా మహిళ కోమాలోకి వెళ్లడంతో రూ. 2.5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ అబూధాబీ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యకు పురిటి నొప్పులు రావడంతో డెలివరీ కోసం భర్త ఆమెను అబూధాబీలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. నార్మల్ డెలివరీ కుదరకపోవడంతో వైద్యులు మహిళకు అనస్తీషియా ఇచ్చి సిజేరియన్ నిర్వహించారు. అయితే ఆపరేషన్ ముగిసే సరికి మహిళ గుండె ఆగిపోయి వెంటనే కోమాలోకి వెళ్లిపోయింది. రోజుల పాటు ఐసీయూలోనే చికిత్స పొందుతూ వచ్చింది. 


వైద్యుల పొరపాటు కారణంగానే తన భార్య కోమాలోకి వెళ్లిందంటూ భర్త కోర్టుకెక్కడంతో కోర్టు వైద్యులదే పొరపాటు అని తీర్పునిచ్చింది. వైద్యుడు మహిళకు ఎక్కువ అనస్థీషియా ఇవ్వడం వల్లే ఆమె కోమాలోకి వెళ్లినట్టు కోర్టు నిర్థారించింది. దీనికి బాధ్యత వహిస్తూ బాధితులకు వైద్యుడు, ఆస్పత్రి యాజమాన్యం నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పునిచ్చింది.  అయితే కింద కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆస్పత్రి యాజమాన్యం పైకోర్టుకు వెళ్లింది. కానీ కింద కోర్టు తీర్పునే పైకోర్టు కూడా సమర్థించింది. బాధితులకు ఆస్పత్రి యాజమాన్యం, తప్పు చేసిన వైద్యుడు 13 లక్షల దిర్హామ్‌ల(రూ. 2.58 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలంటూ ఆదేశించింది. కాగా.. బాధిత మహిళ ఇప్పుడు ఎలా ఉందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.   


Updated Date - 2021-01-25T19:36:37+05:30 IST