పాఠశాలలు నడిపేది ఇలాగేనా?

ABN , First Publish Date - 2021-11-07T14:12:17+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో మాధ్యమిక(సెకండరీ) స్థాయి పాఠశాలల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం పెదవి విరిచింది. ఇలాగేనా పాఠశాలల పనితీరు ఉండేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆయా స్కూళ్లలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం గుర్తించింది. వీటిని ప్రాధాన్యతా క్రమంలో..

పాఠశాలలు నడిపేది ఇలాగేనా?

విద్యార్థులు మధ్యలోనే మానేస్తున్నారు. అయినా.. ఎవరూ పట్టించుకోవట్లేదు 

ఉన్నత తరగతులకు వెళ్లేవారూ తగ్గిపోయారు

పెర్ఫార్మెన్స్‌ రేటూ భారీగా పడిపోయింది

ఏకోపాధ్యాయ స్కూళ్లలో ‘నిష్పత్తి’ ఏదీ?

రాష్ట్రాన్ని ప్రశ్నించిన కేంద్ర ప్రభుత్వం

టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని సూచన

‘సమగ్ర శిక్ష’ పథకానికి రూ.2,878 కోట్లు 

టీచర్‌ పోస్టులు 10 వేలకుపైగా ఖాళీ


న్యూఢిల్లీ(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో మాధ్యమిక(సెకండరీ) స్థాయి పాఠశాలల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం పెదవి విరిచింది. ఇలాగేనా పాఠశాలల పనితీరు ఉండేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆయా స్కూళ్లలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం గుర్తించింది. వీటిని ప్రాధాన్యతా క్రమంలో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మొత్తం 10,697 టీచర్ల పోస్టులు, 500 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. వీటన్నింటినీ భర్తీ చేయాలని పేర్కొంది. అదేవిధంగా రాష్ట్రంలో అమలవుతున్న సమగ్ర శిక్ష పథకానికి సంబంధించి కేంద్ర విద్యా శాఖలోని ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు(పీఏబీ) బడ్జెట్‌ను ఆమోదించింది. ఈ సందర్భంగా 2020-21లో రాష్ట్రంలో పాఠశాల విద్యా పనితీరును సమీక్షించి, అనేక లోపాలను ఎత్తిచూపింది.


పలు జిల్లాల్లో డ్రాపవుట్‌ రేటు(మధ్యలోనే స్కూల్‌ మానేసేవారు) ఎక్కువగా ఉందని, ట్రాన్సిషన్‌ రేటు(ఒక తరగతి నుంచి పైతరగతుల్లో చేరేవారి సంఖ్య) తక్కువగా ఉందని తీవ్రస్థాయిలో ఆక్షేపించింది. అదేవిధంగా పెర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌ స్కోరు బాగోలేదని, దీనిని మెరుగుపర్చుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. టీచర్ల భర్తీతోపాటు ఎస్‌సీఈఆర్‌టీ, డైట్‌ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలని కేంద్రం పేర్కొంది. ప్రాథమికస్థాయిలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్యను 7,803 నుంచి 10,065కు పెంచారని, అయితే.. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా.. తీసుకున్న ఈ చర్యతో విద్యార్థి, టీచర్‌ నిష్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలలను హేతుబద్ధీకరించాలని సూచించింది. అదేవిధంగా 4 జిల్లాల్లో మాధ్యమిక స్థాయి నుంచి మాధ్యమికోన్నత స్థాయికి ట్రాన్సిషన్‌ రేటు 70% కంటే తక్కువగా ఉందని పేర్కొంది.


కడప జిల్లాలో 59.41%, అనంతపురంలో 64.98%, కృష్ణాలో 66.21%, ప్రకాశంలో 68.14% మాత్రమే ఉందని, అన్నిస్థాయిల్లోనూ ట్రాన్సిషన్‌ రేటును మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 2011-12లో మంజూరు చేసిన కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ) భవనాల్లో 7 క్యాంపస్‌ల నిర్మాణం ఇంకా ప్రారంభంకాలేదని ఆక్షేపించింది. ఈ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని పేర్కొంది. 


పిల్లలు మానేస్తున్నారు పట్టించుకోండి

రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో బాలికలకన్నా బాలుర డ్రాపవుట్‌ రేటు ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కడప జిల్లాలో బాలుర డ్రాపవుట్‌ రేటు 24.7%, బాలికల డ్రాపవుట్‌ రేటు 19.1% ఉండగా... కృష్ణా జిల్లాలో బాలురు 21.7%, బాలికలు 12.8%, అనంతపురం బాలురు 20.4%, బాలికలు 17.7%, తూర్పుగోదావరిలో బాలురు 19.6%, బాలికలు 13.2%, ప్రకాశంలో బాలురు 19.5%, బాలికలు 15.8% డ్రాపవుట్‌ రేటు ఉందని కేంద్రం వివరించింది. డ్రాపవుట్‌కు గల కారణాలను గుర్తించి, సరిదిద్దాలని పేర్కొంది. 


‘సమగ్ర శిక్ష’కు రూ.2,878.38 కోట్లు 

ఏపీలో 2021-22లో సమగ్ర శిక్ష పథకం అమలుకు రూ.2878.38 కోట్లను పీఏబీ ఆమోదించింది. దీనిలో ఎలిమెంటరీ స్థాయికి రూ.1878.38 కోట్లు, మాధ్యమిక స్థాయికి రూ.985.32 కోట్లు, ఉపాధ్యాయ శిక్షణకు రూ.14.67 కోట్లను కేటాయించింది. 

Updated Date - 2021-11-07T14:12:17+05:30 IST