Dubai నుంచి వచ్చిన ప్రవాస కార్మికుడు.. ఎయిర్పోర్ట్లో అధికారుల తనిఖీలు.. మా ఇంట్లో ఇవ్వవా..? అంటూ స్నేహితుడు ఇచ్చిన బ్యాగ్లో..
ABN , First Publish Date - 2021-10-17T01:34:20+05:30 IST
దుబాయ్ నుంచి వచ్చిన కార్మికుడిని ఎయిర్ పోర్టులోనే అరెస్టు చేసిన పోలీసులు ఇది జరిగిన రెండేళ్లకు కథలో ఊహించని మలుపు
హైదరాబాద్: దుబాయ్ నుంచి నగరానికి వచ్చాడా కార్మికుడు. ఈ క్రమంలో ఎయిర్పోర్టులో తనిఖీలు చేస్తున్న అధికారులు అతడి బ్యాగ్ తెరిచి చూడగా అందులో ఏకంగా కిలో బంగారం కనిపించింది. దీంతో.. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. 2019లో ఈ ఘటన జరిగింది. నిందితుడు హైదరాబాదీనే.. చాంద్రాయణగుట్టలో నివసిస్తుంటాడు. అతడి పేరు రయీస్ జాబ్రీ. ఈ క్రమంలో రయీస్పై కేసు కూడా నమోదైంది. పోలీసుల అతడి పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు. అయితే.. విచారణ సందర్భంగా రయీస్ తనకేమీ తెలియదని చెప్పుకొచ్చాడు. తనతో కలిసి పని చేసే ఓ ఎన్నారై ఆ బ్యాగ్ను తనకిచ్చి భారత్కు తీసుకెళ్లమన్నాడని పేర్కొన్నాడు.
ఈ ఘటన తరువాత నిందితుడితో సదరు ఎన్నారై పూర్తిగా సంబంధాలు తెంచేసుకున్నాడు. అయితే.. ఇటీవల అతడు హైదరాబాద్కు వచ్చాడని తెలుసుకున్న రయీస్ జాబ్రీ బుధవారం అతడిని కలసుకునేందుకు తన సోదరులు ఆదిల్, సయీద్, సాద్ బిన్ జాబ్రీలను వెంట తీసుకెళ్లాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ వారు అతడిని కోరారు. దీనికి అతడు నిరాకరించడంతో వారు అతడిని హత్య చేసేందుకు నిర్ణయించుకున్నారని డీసీపీ గజరావ్ భూపాల్ తెలిపారు. నిందితులు నలుగురినీ శుక్రవారం పోలీసులు హత్యా నేరంపై అరెస్టు చేశారు.