టీమిండియా టీ20 జట్టు తదుపరి కెప్టెన్ అతడేనట!
ABN , First Publish Date - 2021-09-17T23:00:52+05:30 IST
వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి
న్యూఢిల్లీ: వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో తదుపరి కెప్టెన్ ఎవరన్న దానిపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మదన్ లాల్ మాట్లాడుతూ.. టీ20 జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు రోహిత్శర్మకు మించిన ఆటగాడు మరొకరు లేడని పేర్కొన్నాడు.
క్రికెడ్ అడ్వైజరీ కమిటీ చీఫ్ కూడా అయిన మదన్లాల్.. రోహిత్శర్మ వైస్ కెప్టెన్ మాత్రమే కాదని, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఐదు టైటిళ్లు అందించాడని గుర్తు చేశాడు. అలాగే కోహ్లీ అందుబాటులోలేని సమయంలో 19 టీ20లలో భారత్ సారథ్యం వహించి 15 విజయాలు అందుకున్నాడని పేర్కొన్నాడు. ఈ విషయంలో చర్చ అవసరం లేదని, రోహిత్శర్మే తదుపరి టీ20 కెప్టెన్ అవుతాడని భావిస్తున్నట్టు మదన్లాల్ తేల్చి చెప్పాడు. రోహిత్ తన ఫామ్ను అలాగే కొనసాగిస్తే వన్డే కెప్టెన్ కూడా అవుతాడని పేర్కొన్నాడు.