చెరువుల రక్షణకు చర్యల్లేకనే!
ABN , First Publish Date - 2020-10-22T07:31:57+05:30 IST
హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణలపై రాష్ట్ర హైకోర్టు స్పందించింది. చెరువుల రక్షణకు సరైన చర్యలు తీసుకోనందువల్లే ఇటీవల కురిసిన వర్షాలకు జంట
జంట నగరాలు అతలాకుతలమయ్యాయి
ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి
చెరువులు, కుంటలను కాపాడాలి: హైకోర్టు
ఆక్రమణల కథనంపై స్పందించిన ధర్మాసనం
రక్షణ కమిటీల్లో ఎస్పీ స్థాయి అధికారిని చేర్చండి
డిసెంబరు 12లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణలపై రాష్ట్ర హైకోర్టు స్పందించింది. చెరువుల రక్షణకు సరైన చర్యలు తీసుకోనందువల్లే ఇటీవల కురిసిన వర్షాలకు జంట నగరాలు అతలాకుతలమయ్యాయని అభిప్రాయపడింది. చెరువులు, కుంటల రక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. చెరువుల పరిరక్షణకు వేసే కమిటీల్లో ఎస్పీ స్థాయి అధికారిని చేర్చాలని ఆదేశించింది. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల ఆక్రమణలపై డిసెంబరు 12 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది. చెరువుల ఆక్రమణలపై ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనంపై సీజే తక్షణమే స్పందించారు. సుమోటో పిల్గా విచారణకు స్వీకరించారు. హైదరాబాద్ శివారు హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో 3000 వేలకు పైగా చెరువులు ఉండేవని కథనంలో ఉటంకించారు. ఆరేళ్ల కిందటే ఆయా చెరువులకు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిని నిర్ధారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిదని తెలిపారు.
కానీ, కేవలం 225 చెరువులకు మాత్రమే ఎఫ్టీఎల్ను ఖరారు చేశారని, ఇది మొత్తం చెరువుల్లో 10 శాతం కూడా లేదని వివరించారు. చెరువుల విస్తీర్ణం, సర్వే నంబర్లపై వ్యవసాయ, రెవెన్యూ శాఖల నివేదికలు సరిపోలడం లేదన్నారు. చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోనే అనేక కాలనీలు వెలిశాయన్నారు.
రామన్నకుంట, నాగోలు సమీపంలో బండ్లగూడ చెరువు, రామంతాపూర్లోని చిన్నచెరువు, మల్కాచెరువు, షామీర్పేట్ ట్యాంక్, నల్ల చెరువు, గోసాయ్ కుంట, ఎర్రకుంట తదితర చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని కథనంలో తెలిపారు. పురపాలకశాఖ, చెరువుల సంరక్షణ కమిటీలు 3,534 చెరువులను సర్వే చేయాలని నిర్ణయించగా 3,029 చెరువుల సర్వే మాత్రమే పూర్తయ్యిందన్నారు. మిగిలిన చెరువుల సర్వే చేయలేదన్నారు.
ఈ కథనాన్ని సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం ఆయా చెరువుల ఆక్రమణలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 12కు వాయిదా వేసింది.