బ్రిటన్‌కు బుద్ధి చెప్పిన భారత్ !

ABN , First Publish Date - 2021-10-02T13:15:05+05:30 IST

‘‘కొవిషీల్డ్‌’’ టీకాను అధికారికంగా గుర్తించనందుకు బ్రిటన్‌కు భారత్‌ దీటైన జవాబిచ్చింది.

బ్రిటన్‌కు బుద్ధి చెప్పిన భారత్ !

టీకా తీసుకున్నా బ్రిటన్‌ పౌరులకు 10 రోజుల క్వారంటైన్‌ 

న్యూఢిల్లీ, అక్టోబరు 1: ‘‘కొవిషీల్డ్‌’’ టీకాను అధికారికంగా గుర్తించనందుకు బ్రిటన్‌కు భారత్‌ దీటైన జవాబిచ్చింది. కొవిషీల్డ్‌ను గుర్తించకుండా టెస్టులు, క్వారంటైన్‌ విషయంలో భారత్‌ నుంచి వచ్చే వారికి బ్రిటన్‌ ఏవైతే నిబంధనలు విధించిందో.. వాటినే బ్రిటన్‌ నుంచి వచ్చేవారికి భారత్‌ వర్తింపజేసింది. ఈ నెల 4 నుంచి అమలయ్యే ఈ నిబంధనల ప్రకారం బ్రిటన్‌లో టీకా తీసుకున్నా ఆ దేశ పౌరులు మన దగ్గరకు వస్తే 10 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందే. బయల్దేరడానికి 72 గంటల ముందుగా చేయించుకున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి. విమానాశ్రయంలో దిగాక ఒకసారి, 8వ రోజు మరోసారి టెస్టు చేయించుకోవాలి. మరోవైపు భారతీయులకు ప్రయాణ ఆంక్షలను సులభతరం చేస్తామని బ్రిటన్‌ ప్రకటించింది. 


సెప్టెంబరులో ఉపశమనం

కరోనా సెకండ్‌ వేవ్‌ నెమ్మదించడంతో సెప్టెంబరులో కేసులు బాగా తగ్గాయి. గత నెల మొత్తమ్మీద దేశంలో 9.5 లక్షల మంది వైరస్‌ బారినపడ్డారు. ఆగస్టు (11.5 లక్షలు)తో పోలిస్తే కేసులు 17.4 శాతం తగ్గాయి. కాగా, దేశంలో గురువారం 26,727 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. తాజా కేసుల్లో దాదాపు 16 వేలు కేరళ నుంచే ఉన్నాయి. గురువారం దేశంలో 277 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ నుంచి 28 వేల మంది కోలుకున్నారు. యాక్టివ్‌ కేసులు 2.75 లక్షలకు తగ్గాయి.

Updated Date - 2021-10-02T13:15:05+05:30 IST