మాకు డబ్బులు అవసరం లేదు: షోయబ్కు కపిల్ ఘాటు రిప్లై
ABN , First Publish Date - 2020-04-09T23:55:27+05:30 IST
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు నిధుల కోసం భారత్-పాక్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ నిర్వహిస్తే
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు నిధుల కోసం భారత్-పాక్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ నిర్వహిస్తే బాగుంటుందన్న పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ప్రతిపాదనకు భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ ఘాటుగా జవాబిచ్చాడు. షోయబ్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిపై పోరాటం కోసం నిధులు సేకరించడానికి చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ మధ్య వన్డే సిరీస్ నిర్వహించాలని అక్తర్ ప్రతిపాదించాడు. తటస్థ వేదిక అయిన దుబాయ్లో మ్యాచ్లు నిర్వహించాలని, ప్రేక్షకులకు అనుమతి లేకుండా కేవలం టీవీలకే పరిమితం చేయాలని అన్నాడు. తద్వారా వచ్చే డబ్బును కరోనాపై పోరుకు వినియోగించవచ్చని ప్రతిపాదించాడు. ఇందుకు భారత్ ముందుకు రావాలని కోరాడు.
అక్తర్ ప్రతిపాదనకు బీసీసీఐ స్పందించకపోయినా, కపిల్ మాత్రం కాస్తంత ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో రిస్క్ తీసుకుని క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పాడు. అంతేకాదు, కరోనాపై పోరుకు విరాళాలు సేకరించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశాడు. తమ దగ్గర సరిపడా డబ్బు ఉందని పేర్కొన్నాడు. బీసీసీఐ ఇప్పటికే రూ. 51 కోట్లను విరాళంగా ఇచ్చిందని గుర్తు చేశాడు. అవసరమైతే ఇంకా ఇస్తుందన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా ఐదారు నెలలు క్రికెట్ ఆడకపోవడమే మంచిదని లెజండరీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు.