Tokyo Olympics: పోరాడి ఓడిన భారత అమ్మాయిలు.. చెదిరిన కల!
ABN , First Publish Date - 2021-08-06T14:22:18+05:30 IST
భారత మహిళల హాకీ జట్టు బ్రిటన్తో జరిగిన కాంస్య పతక పోరులో పోరాడి ఓడారు. భారత అమ్మాయిలు చివరి వరకు అద్భుతమైన పోరాటపటిమ చూపించారు. పురుషుల జట్టు బాటలోనే అమ్మాయిలు కూడా కాంస్య పతక పోరులో సూపర్బ్గా ఆడారు. దుర్భేద్యమైన డిఫెండింగ్ గల గ్రేట్ బ్రిటన్ను ఓడించినంత పనిచేశారు.
టోక్యో: భారత మహిళల హాకీ జట్టు బ్రిటన్తో జరిగిన కాంస్య పతక పోరులో పోరాడి ఓడారు. భారత అమ్మాయిలు చివరి వరకు అద్భుతమైన పోరాటపటిమ చూపించారు. పురుషుల జట్టు బాటలోనే అమ్మాయిలు కూడా కాంస్య పతక పోరులో సూపర్బ్గా ఆడారు. దుర్భేద్యమైన డిఫెండింగ్ గల గ్రేట్ బ్రిటన్ను ఓడించినంత పనిచేశారు. తృటిలో మ్యాచ్ చేజారిన భారత అమ్మాయిల ఆటతీరు మాత్రం అమోఘం. ఇవాళ్టి కాంస్య పతక పోరులో భారత అమ్మాయిల ఆట గురించి ఎంత చెప్పిన తక్కువే. మ్యాచ్ మొదటి నుంచి టీమిండియా అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది.
ఇక మ్యాచ్ మొదటి క్వార్టర్లో ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టు పోటిపడ్డ గోల్స్ మాత్రం చేయలేకపోయాయి. అయితే, రెండో క్వార్టర్ మొదలైన కొద్దిసేపటికే బ్రిటన్ వరుసగా రెండో గోల్స్ చేసి భారత్పై పైచేయి సాధించింది. ఆ తర్వాత కాసేపటికే భారత అమ్మాయిలు కూడా గోల్ చేయడంతో స్కోర్ 2-1కు తగ్గింది. గుర్జీత్ కౌర్ భారత్కు తొలి గోల్ అందించింది. ఈ క్రమంలో భారత్కు ఓ పెనాల్టీ కార్నర్ లభించడం, దాన్ని మళ్లీ గుర్జీత్ గోల్గా మరల్చడం చకచక జరిగిపోయాయి. ఈ గోల్తో భారత్ 2-2తో స్కోర్ను సమం చేసింది.
ఇక రెండో క్వార్టర్ ముగియడానికి కొద్దిసేపు ముందు వందన కటారీయా భారత్కు మూడో గోల్ అందించింది. దీంతో బ్రిటన్ను వెనక్కి నెట్టి భారత్ 3-2 తేడాతో లీడ్లోకి వెళ్లింది. మూడో క్వార్టర్లో బ్రిటన్ దూకుడుగా మొదలెట్టింది. అలాగే ఓ గోల్ కూడా సాధించింది. దీంతో స్కోర్ 3-3తో సమం అయింది. ఈ మధ్యలో భారత్కు రెండు పెనాల్టీలు లభించిన వాటిని గోల్స్గా మరల్చడంలో విఫలం అయ్యారు. అటు బ్రిటన్ కూడా గోల్ పోస్ట్పై వరుసగా విరుచుపడింది. కానీ, భారత గోల్ కీపర్ సవిత అడ్డు గోడలా నిలబడింది.
దాంతో బ్రిటన్కు గోల్స్ రాలేదు. మూడో క్వార్టర్ ముగిసేసరికి ఇరు జట్లు 3-3తో సమంగా నిలిచాయి. ఇక నాలుగో క్వార్టర్ను ప్రత్యర్థి పెనాల్టీ కార్నర్తో ప్రారంభించింది. కానీ, భారత్ నిలువరించడంతో గోల్ చేయలేకపోయింది. అనంతరం మరికొద్దిసేపటికే బ్రిటన్ మరో పెనాల్టీ రాబట్టింది. ఈసారి దాన్ని గోల్ చేయడంతో 4-3 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత భారత్ పలుమార్లు గోల్ కోసం ప్రత్నించిన ఫలితం దక్కలేదు. దీంతో భారత్ 3-4 తేడాతో పరాజయం పాలైంది. దేశానికి మరో పతకం అందించాలనే భారత అమ్మాయిల కల చెదిరింది.