Commonwealth Gamesకి దూరంగా భారత హాకీ జట్లు
ABN , First Publish Date - 2021-10-06T02:28:22+05:30 IST
బర్మింగ్హామ్లో వచ్చే ఏడాది జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ నుంచి భారత పురుషుల, మహిళల హాకీ జట్లు
న్యూఢిల్లీ: బర్మింగ్హామ్లో వచ్చే ఏడాది జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ నుంచి భారత పురుషుల, మహిళల హాకీ జట్లు తప్పుకున్నాయి. ఈ మేరకు హాకీ ఇండియా అధ్యక్షుడు జ్ఞానంద్రో నింగోంబం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నరీందర్ బాత్రాకు తెలియజేశారు. కామెన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్న భారత హాకీ జట్లు ఏషియన్ గేమ్స్పై దృష్టిసారించనున్నాయి. ఇందులో చక్కని ప్రదర్శన కనబరిస్తే 2024 పారిస్ ఒలింపిక్స్కు ఖండాంతర బెర్త్ లభిస్తుంది. వచ్చే ఏడాది జులైలో కామన్వెల్త్ గేమ్స్ జరగనుండగా, ఆగస్టులో ఆసియా గేమ్స్ జరగనున్నాయి.
2024 పారిస్ ఒలింపిక్ క్రీడలకు ఆసియా క్రీడలు కాంటినెంటల్ క్వాలిఫికేషన్ ఈవెంట్ అని నింగోంబం పేర్కొన్నారు. కాబట్టి ఆసియా గేమ్స్ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకోవడంతోపాటు కరోనా నేపథ్యంలో ఆటగాళ్లను రిస్క్లోకి నెట్టలేమని పేర్కొన్నారు.
భారత కొవిడ్ -19 టీకాలను గుర్తించేందుకు ఇటీవల నిరాకరించిన యూకే భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ప్రతిగా భారత్ కూడా యూకే పౌరులపై ఆంక్షలు విధించింది. భారత్ వచ్చే యూకే పౌరులకు పది రోజుల క్వారంటైన్ను తప్పనిసరి చేసింది.
ఈ నేపథ్యంలో ఒడిశా రాజధాని భువనేశ్వర్లో వచ్చే నెలలో ఎఫ్ఐహెచ్ పురుషుల జూనియర్ ప్రపంచకప్ నుంచి ఇంగ్లండ్ తప్పుకుంది. తాజాగా, ఇప్పుడు కామన్వెల్త్ నుంచి తప్పుకున్నట్టు భారత్ ప్రకటించడం గమనార్హం.