'వందే భారత్'లో భాగస్వామ్యం అవుతున్న ఇండిగో
ABN , First Publish Date - 2020-05-22T18:43:38+05:30 IST
కరోనా సంక్షోభం నేపథ్యంలో లాక్డౌన్ వల్ల వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం 'వందే భారత్ మిషన్' చేపట్టింది.
గల్ఫ్ నుంచి 97 విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటన
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో లాక్డౌన్ వల్ల వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం 'వందే భారత్ మిషన్' చేపట్టింది. ఇప్పటివరకు ఈ మిషన్లో భాగంగా ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మాత్రమే విమానాలు నడిపింది. తాజాగా ప్రైవేట్ ఎయిర్లైన్ ఇండిగో కూడా దీనిలో భాగస్వామ్యం అవుతోంది. గల్ఫ్లోని నాలుగు దేశాల నుంచి కేరళకు 97 విమాన సర్వీసులు నడపనున్నట్లు ఇండిగో ఎయిర్లైన్స్ యాజమాన్యం గురువారం ప్రకటించింది. వీటిలో కువైట్ నుంచి 23, దోహా నుంచి 28, మస్కట్ నుంచి 10, సౌదీ అరేబియా నుంచి 36 విమానాలు కేరళకు నడపనుంది.
ఈ సందర్భంగా ఇండిగో సీఈఓ రోనోజోయ్ దత్తా మాట్లాడుతూ... తమ సంస్థలో ఉన్న మొత్తం 180 విమానాల్లో 97 ఫ్లైట్స్ను కేవలం రీపాట్రియేషన్కే కేటాయించినట్లు తెలిపారు. ఇక ప్రస్తుత కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రయాణికుల ఆరోగ్య సంరక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. లాక్డౌన్ వల్ల గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు తమ సంస్థను భాగస్వామ్యం చేసినందుకు ఈ సందర్భంగా పౌర విమానయాన మంత్రిత్వశాఖకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.