England: ఇండియాతో టెస్టులకు ఒల్లీ పోప్ డౌటే!

ABN , First Publish Date - 2021-07-10T22:35:00+05:30 IST

భారత్‌తో జరగనున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఒల్లీ పోప్ ఆడడం అనుమానంగానే ఉంది.

England: ఇండియాతో టెస్టులకు ఒల్లీ పోప్ డౌటే!

లండన్: భారత్‌తో జరగనున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ ఒల్లీ పోప్ ఆడడం అనుమానంగానే ఉంది. ఈ నెల 2న కెంట్‌తో జరిగిన డొమెస్టిక్ టీ20 మ్యాచ్‌లో సర్రేకు ప్రాతినిధ్యం వహించిన 23 ఏళ్ల పోప్ గాయపడ్డాడు. అతడి తొడ కండరానికి తీవ్రంగా గాయం కావడంతో భారత్‌తో జరగనున్న తొలి టెస్టుకు అతడు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అయితే, వీలైనంత త్వరగా అతడిని జట్టుకు అందుబాటులో ఉంచాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, సర్రే ఫిట్‌నెస్ బృందం ప్రయత్నిస్తోంది. భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు వచ్చే నెల 4న ట్రెంట్ బ్రిడ్జ్‌లో ప్రారంభం అవుతుంది. 


ఇప్పటి వరకు 19 టెస్టులు ఆడిన పోప్ 882 పరుగులు చేశాడు. గతేడాది జనవరిలో దక్షిణాఫ్రికాపై అజేయంగా 135 పరుగులు చేశాడు. టెస్టుల్లో ఇదే అతడికి అత్యధిక స్కోరు. అయితే, గత 8 టెస్టుల్లో చాలా పేలవంగా ఆడాడు. కనీసం 35 పరుగుల మార్కును కూడా దాటలేకపోయాడు. పోప్ కనుక సకాలంలో గాయం నుంచి కోలుకోకుంటే అతడి స్థానంలో డేవిడ్ మలాన్‌‌కు చోటు దక్కే అవకాశం ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మలాన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుండడంతో అతడికి ఈసారి చాన్స్ దక్కే అవకాశం ఉంది. 

Updated Date - 2021-07-10T22:35:00+05:30 IST