సీబీఎస్ఈకి ముందే ఇంటర్ పరీక్షలు
ABN , First Publish Date - 2021-01-07T08:22:48+05:30 IST
కాలేజీలు ఆలస్యంగా ప్రారంభమైనా ఇంటర్ విద్యార్థులు నష్టపోకుండా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నామని ఇంటర్ విద్య కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. కాలేజీల ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం
ప్రభుత్వం అనుమతిస్తే సంక్రాంతి తర్వాత కాలేజీలు
70 శాతం సిలబస్కే పరీక్షల నిర్వహణ
ఇంటర్ విద్య కార్యదర్శి..ఉమర్ జలీల్
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కాలేజీలు ఆలస్యంగా ప్రారంభమైనా ఇంటర్ విద్యార్థులు నష్టపోకుండా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నామని ఇంటర్ విద్య కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. కాలేజీల ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అనుమతి లభిస్తే సంక్రాంతి తర్వాత తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. బుధవారం తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఉమర్ జలీల్ మాట్లాడారు. సీబీఎ్సఈ బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదలైన విషయాన్ని ప్రస్తావించగా.. మే-4 నుంచి జూన్-10 మధ్యలో బోర్డు పరీక్షలు నిర్వహించాలని సీబీఎ్సఈ నిర్ణయించిందని, అంతకంటే ముందే ఇంటర్ బోర్డు పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు.
ఈసారి సిలబస్ 70ు ఉన్నందున తరగతులను ప్రారంభించి ఆ మేరకే వార్షిక పరీక్షలు పూర్తి చేస్తామన్నారు. సీబీఎ్సఈ ప్రకటించినట్టు ఇంటర్ బోర్డు పరీక్షలు సైతం విద్యార్థులకు అనుకూలంగా ఉంటాయని, ఎక్కువ ఐచ్ఛికాలు (ఆప్షన్స్) ఉంటాయని పేర్కొన్నారు. ప్రైవేటు జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ దాదాపు పూర్తయ్యాయని, అంతర్ జిల్లా కళాశాలల మార్పుపై కొన్ని కాలేజీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.