పవన్ను కలిసి గోడు వెళ్లబోసుకున్న నిరుద్యోగులు
ABN , First Publish Date - 2021-07-07T18:32:04+05:30 IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్ను నిరుద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో కలిశారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ను నిరుద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా తమ గోడు వెళ్లబోసుకున్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు ‘అన్న వస్తున్నాడు’ అంటూ ఊదరగొట్టారని, ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం అన్నారని, ఇప్పుడు ఆ ఊసే లేకుండా చేస్తూ.. జాబులు అడిగితే జైలుకు పంపిస్తున్నారని వాపోయారు.
జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మామని, ఇప్పుడు నట్టేట మునిగామంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల ఉద్యోగాల ఖాళీ ఉంటే.. పదివేలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి అందరనీ మోసం చేశారన్నారు. ‘నేను విన్నాను...నేను ఉన్నాను’ అన్నది ఇందుకేనా అని ప్రశ్నించారు. సమస్యలపై జనసేనాని పోరాడాలని కోరుతున్నామని, ఉద్యోగాల కోసం డిగ్రీలు చేత పట్టుకుని లక్షల మంది యువత ఎదురు చూస్తున్నారన్నారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి... ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. వారి మాటలను సానుకూలంగా విన్న పవన్.. పీఏసీలో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు.