బాధితులకు భరోసా
ABN , First Publish Date - 2021-05-16T06:14:49+05:30 IST
బాధితులకు భరోసా
మతిస్థిమితం లేని కుటుంబానికి జడ్జి హుస్సేన్ నాయక్ చేయూత
సాయం అందించిన ఎస్సై కృష్ణప్రసాద్
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
రేగొండ, మే 15 : దయనీయ స్థితిలో ఉన్న మతిస్థిమితం లేని కుటుంబాన్ని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి.హుస్సేన్ నాయక్, ఎస్సై కృష్ణ ప్రసాద్ గౌడ్ శనివారం పరామర్శించారు. ‘ఇంటి పెద్ద మరణం.. ఐదుగురి జీవన్మరణం’ శీర్షికన గురువారం ప్రచురితమైన కథనంపై వారు స్పందించారు. మండలంలోని దామరంచపల్లికి చెందిన అంకూస్ మియాకు ఐదుగురు సంతానం. భార్యతోపాటు పిల్లలందరూ బుద్ధి మాంధ్యం కలిగి ఉన్నారు. ఐదుగురు సంతానానికి యుక్త వయసు వచ్చినా ఈ రుగ్మత వారిని వీడలేదు. అంకూస్ మియా భార్య నూర్జహాన్ది కూడా అదే పరిస్థితి. వీరందరి పోషణ భారం మోస్తున్న అంకూస్ మియా ఇటీవల మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితికి చేరుకుంది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఇదిచూసిన జడ్జి హుస్సేన్ నాయక్, ఎస్సై కృష్ణ ప్రసాద్ చలించిపోయారు. దామరంచపల్లికి వెళ్లి ఆ కుటుంబాన్ని కలిశారు. బాధితుల స్థితిగతులు సర్పంచ్ నీలాను అడిగి తెలుసుకున్నారు. తనవంతుగా 25కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రభుత్వం తరఫున సహాయం అందేలా కృషి చేస్తానని అన్నారు. దాతలతో మాట్లాడి మరింత సహాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ఎస్సై కృష్ణప్రసాద్గౌడ్ కూడా క్వింటా యాబై కిలోల బియ్యంతో పాటు రూ. 10 వేలు అందచేశారు. రేగొండ మండలంలో విధులు నిర్వర్తించినన్ని రోజులూ బియ్యం అందిస్తానని హామీ ఇచ్చారు. వీరి వెంట ఎంపీటీసీ బొట్ల కవిత, టీఆర్ఎస్ నాయకులు రవి సామ్రాట్ తదితరులు ఉన్నారు.