జడ్జి రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటాం: శ్రావణ్కుమార్
ABN , First Publish Date - 2020-09-29T21:30:33+05:30 IST
జడ్జి రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని సీనియర్ న్యాయవాది శ్రావణ్కుమార్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్క్రిప్టును చదవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు.
అమరావతి: జడ్జి రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని సీనియర్ న్యాయవాది శ్రావణ్కుమార్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్క్రిప్టును చదవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. అక్టోబర్ 2న ఛలో మదనపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చామని, ప్రజాస్వామ్యవాదులంతా హాజరుకావాలని కోరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు జడ్జి రామకృష్ణ తమ్ముడిని తీవ్రంగా గాయపరిచారని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోయాయని శ్రావణ్కుమార్ ఆరోపించారు.
ఇప్పటికే దళిత న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడి ఘటనలో వాస్తవాలు వెలికితీయడానికి పార్టీపరంగా ఒక నిజ నిర్ధారణ కమిటీని వేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రకటించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యేలు పాశం సునీల్ కుమార్, నెలవల సుబ్రమణ్యం, గత ఎన్నికల అసెంబ్లీ అభ్యర్థులు వంతగాని నరసింహ ప్రసాద్, జేడీ రాజశేఖర్, చిత్తూరు జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు ఎ. పటర్ సభ్యులుగా ఉన్నారు.