కడప జిల్లా: ‘మా ఊర్లో కొండను ఎమ్మెల్యే దోచుకుంటున్నారు.. కాపాడండి’
ABN , First Publish Date - 2021-07-27T19:42:35+05:30 IST
కడప జిల్లా: అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒక కొండను ఇప్పటికే తవ్వేశారు.
కడప జిల్లా: అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒక కొండను ఇప్పటికే తవ్వేశారు. ఇంకొక కొండను తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి రోజూ వంద నుంచి రెండు వందల గ్రావెల్ ట్రిప్పులను తరలించే ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తా కథనాన్ని ఆంధ్రజ్యోతి కడప జిల్లా ఎడిషన్లో ప్రచురించింది. అది కేవలం ఆంధ్రజ్యోతి రాసిన కథనం మాత్రమే కాదు.. దీనిపై అక్కడ గ్రామస్తులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. తమ ఊరిలో ఉన్న కొండను స్థానిక అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దోచుకుంటున్నారని, ఈ కొండను కాపాడాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. వీఎన్ పల్లి మండలం, ఇందుకూరు గ్రామంలో ఈ ఘటన జరుగుతోంది.
ఆయన అధికార పార్టీ కీలక నాయకుడు. పదైదేళ్ల క్రితం సర్వరాయసాగర్ నిర్మాణం కోసం మట్టి తీసిన పొలాల్లో చేపల చెరువు నిర్మాణం చేపడుతున్నారు. దీంతో ఇక్కడి గుంతలను పూడ్చేందుకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొండలు కొల్లగొడుతున్నారు. అక్రమంగా ఎర్రమట్టి మెక్కేస్తున్నారు. ఎక్స్కవేటర్లు, టిప్పర్లతో లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్రమట్టి అక్రమంగా తరలిస్తున్నారు. పశువుల మేతకు లేకుండా కొండను తవ్వేస్తున్నారు అడ్డుకోండని గ్రామస్తులు రెవిన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నేత మెక్కేస్తున్న మట్టి విలువ రూ.కోట్లలో ఉంటుందని అంచనా. వీఎన్ పల్లి మండలం ఇందుకూరు గ్రామంలో జరుగుతున్న ఎర్రమట్టి అక్రమ రవాణా భాగోతంపై ఏబీఎన్ హెడ్లైన్ షోలో గ్రామ ప్రజలు మాట్లాడారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.