కోవిడ్‌-19పై పోరాటానికి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ విరాళం

ABN , First Publish Date - 2020-03-30T19:55:53+05:30 IST

కోవిడ్-19 మహమ్మారిపై పోరాటం చేసేందుకు సహాయార్థంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయన్ని అందిస్తున్నామని కర్ణాటక స్టేట్ క్రికెట్

కోవిడ్‌-19పై పోరాటానికి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ విరాళం

బెంగళూరు:  కోవిడ్-19 మహమ్మారిపై పోరాటం చేసేందుకు సహాయార్థంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయన్ని అందిస్తున్నామని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ) ఆదివారం ప్రకటించింది. పీఎం-కేర్స్ ఫండ్‌కు రూ.50 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు అసోసియేషన్ స్పష్టం చేసింది. ‘‘బీసీసీఐ ద్వారా పీఎం-కేర్స్ ఫండ్‌, కర్ణాటక ముఖ్యమంత్రి సహాయనిధులకు చెరి రూ.50 లక్షలు కేఎస్‌సీఏ విరాళంగా ప్రకటిస్తుంది’’ అని అసోసియేషన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. 


కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 29 మంది భారతీయులూ ఉన్నారు. ఈ వైరస్‌ను అరికట్టేందుకు సహాయార్థంగా కొద్ది రోజుల క్రితం బీసీసీఐ రూ.51 కోట్ల విరాళంగా ప్రకటించింది. 


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్-19పై చేస్తున్న ఈ పోరాటానికి ప్రోత్సాహకంగా ఉంటుందని కేఎస్‌సీఏ ఆశాభావం వ్యక్తం చేసింది. ‘‘కర్ణాటక ప్రభుత్వంతో కలిసి కేఎస్‌సీఏ ఈ విపత్తు నివారణ కోసం చేస్తున్న పోరాటంలో పని చేస్తుంది. ఇందుకోసం అవసరమైన మద్దతుతో పాటు.. అవసరమైన పరికరాలు సమకూర్చేందుకు కూడా అసోసియేషన్ కృషి చేస్తుంది’’ అని ప్రతినిధి తెలిపారు. కేఎస్‌సీఏతో పాటు.. బెంగాల్, ముంబై, సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు కూడా విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-03-30T19:55:53+05:30 IST