లాక్‌డౌన్‌‌పై కేసీఆర్ సమాలోచనలు!

ABN , First Publish Date - 2021-03-22T21:34:19+05:30 IST

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించే అంశంపై

లాక్‌డౌన్‌‌పై కేసీఆర్ సమాలోచనలు!

హైదరాబాద్: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ పెట్టాలా వద్దా అనేదానిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థుల్ని పైతరగతులకు ప్రమోట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మంగళవారం అసెంబ్లీలో కేసీఆర్‌ కీలక ప్రకటన చేయనున్నారు. పెరుగుతున్న కోవిడ్ కేసులతో సర్కార్ అప్రమత్తమైంది. పాఠశాలల మూసివేతకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సినిమా థియేటర్లు, జనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 


కరోనాపై త్వరలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో పాక్షికంగా లాక్‌డౌన్ అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో వీకెండ్స్‌లో లాక్‌డౌన్  విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వారంలో 3 రోజుల పాటు లాక్‌డౌన్ లేదా రాత్రిపూట కర్ఫ్యూపై కసరత్తు చేస్తున్నారు. కోవిడ్ అదుపులోనే ఉన్నా.. ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 26 కంటే ముందే అసెంబ్లీ సమావేశాలు ముగించే యోచనలో సర్కార్ ఉంది.  


రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో కరోనా కలవరపెడుతోంది. కేసులు తగ్గుముఖం పట్టి మళ్లీ పాత పరిస్థితులు వచ్చాయని అందరూ భావించిన తరుణంలో పాఠశాలల్లో విస్తరిస్తున్న కొవిడ్‌ ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్‌లతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హడలిపోతున్నారు. మరో నెలన్నర రోజుల్లో పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు సందిగ్ధత ఏర్పడింది.

Updated Date - 2021-03-22T21:34:19+05:30 IST